Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుభక్తికి గౌరవార్చనగా స్వర్ణ వివాహ మహోత్సవం

గురుభక్తికి గౌరవార్చనగా స్వర్ణ వివాహ మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – నవాబుపేట: గురువు–శిష్య బంధం ఎంత పవిత్రమో చాటి చెప్పే అరుదైన సంఘటన నవాబుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చిన్నతనంలో ట్యూషన్ కోసం వెళ్లిన శిష్యుడిని అనంతరం తమ సంతానంలా చేరదీసుకున్న గురుదంపతుల 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఆ దంపతుల కుటుంబ సభ్యులతో కలిసి దత్తపుత్రుడు ఘనంగా నిర్వహించి అందరి హృదయాలను హత్తుకున్నాడు.

నవాబుపేట మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా సమర్థవంతంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన  ఎస్. సరస్వతి, బి. అనంతకృష్ణ దంపతులు విద్యాసేవతో పాటు ఆధ్యాత్మిక సేవలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా భక్తులైన వీరు తరచూ షిరిడి, పుట్టపర్తి క్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకుంటూ భక్తి మార్గంలో ముందుకు సాగుతున్నారు.

వీరి ఆధ్యాత్మిక సేవలో భాగంగా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన బృంగి రవీందర్ వ్యవసాయ క్షేత్రంలో షిరిడి సాయి దేవాలయాన్ని నిర్మించి, షిరిడి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించారు, అలాగే సత్యసాయి బాబా ప్రతిమను నెలకొల్పారు. ఆలయంలో ప్రతిరోజూ పూజలు జరిగేలా అవసరమైన ఏర్పాట్లను నేటికి కూడా సరస్వతి మేడం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి వేడుకలను గ్రామ ప్రముఖులతో కలిసి ఘనంగా నిర్వహించడం ఈ దంపతుల ప్రత్యేకత.

సంతానం లేని ఈ దంపతులు చిన్నతనంలో ట్యూషన్‌కు వచ్చిన కె. యాదయ్యను తమతోపాటు ఇంట్లో ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత చదువులు చదివించారు. అనంతరం గాయత్రి అనే యువతితో వివాహం జరిపించారు. యాదయ్య–గాయత్రి దంపతులకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. యాదయ్యను తమ కన్నకొడుకులా చూసుకుంటూ ఇల్లు, భూమి తదితర సౌకర్యాలను కల్పించారు.

గురుదంపతుల అపారమైన ప్రేమకు కృతజ్ఞతగా బుధవారం వారి స్వర్ణ వివాహ మహోత్సవంను యాదయ్య ఉపాధ్యాయ దంపతుల కుటుంబాల సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపాధ్యాయ దంపతుల సహచర విశ్రాంత ఉపాధ్యాయులు, బంధుమిత్రులతో పాటు  పూర్వ విద్యార్థులు, మండల ప్రముఖులు పాల్గొని గురుదంపతులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు.ఈ వేడుక గురు–శిష్య బంధానికి ప్రతీకగా నిలిచింది. “గురువు దైవసమానం” అనే నానుడికి జీవం పోసిన ఈ సంఘటన స్థానికుల ప్రశంసలను అందుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -