ముంబయి : భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో అప్రమత్తంగా వ్యవహారిస్తున్నారు. బలహీనమైన మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భారత వృద్ధి రేటు తగ్గొచ్చనే అంచనాల నేపథ్యంలో జనవరి నెలలో ఈక్విటీ మ్యూచు వల్ ఫండ్లలోకి వచ్చే పెట్టుబడులు వరుసగా రెండో నెలలోనూ క్షీణించాయి. ఎఎంఎఫ్ఐ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. డిసెంబర్లో రూ.28,054 కోట్లుగా ఉన్న పెట్టుబడులు జనవరిలో 14.35 శాతం తగ్గి రూ. 24,028 కోట్లకు పరిమితమయ్యాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో అత్యధికంగా 23.4 శాతం పతనం కనిపించింది. అదేవిధంగా మిడ్ క్యాప్ ఫండ్లలో 23.7 శాతం, స్మాల్ క్యాప్ ఫండ్లలో 23.1 శాతం పెట్టుబడులు క్షీణించాయి. అయితే.. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు సుమారు 28 శాతం పెరగడం విశేషం. మరోవైపు గోల్డ్ ఇటిఎఫ్ల్లో రికార్డ్ పెట్టుబడులు చోటు చేసుకున్నాయి. జనవరిలో ఇవి ఏకంగా రెండింతలు పెరిగి రూ.24,039 కోట్లకు చేరాయి. బంగారంపై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరగడం, దీనిని ఒక సురక్షిత మైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు జనవరి చివరి నాటికి రూ.81.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి.



