పేలవంగా రిటర్నింగ్ అధికారి నిర్ణయం :
కేంద్ర ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వును తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నాడిక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ను కాంగ్రెస్ అభ్యర్థి నటరాజన్తో పాటు నేతలు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, అభిషేక్ మను సింఘ్వీ, వివేక్ టంఖా, రణదీప్ సుర్జేవాలా, భూపేష్ బఘేల్, దీపా దాస్మున్షీలతో కూడిన కాంగ్రెస్ బృందం కలిసింది. నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం మీడియాతో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ‘‘ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమే. రాజ్యాంగ సంస్థలపై మాకు ఇంకా పూర్తి విశ్వాసం ఉంది. అందుకే మేము ఈ పోరాటం చేస్తున్నాం’’ అని అన్నారు. అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ ‘‘రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) తప్పుడు ఉత్తర్వు జారీ చేశారు.
ఎటువంటి సందేహం లేకుండా, వివాదానికి తావులేకుండా ఈసీకి వివరించాం. అలాగే తప్పు జరగలేదని నిరూపించాం. ఆ ఉత్తర్వు 2+2ను 7తో పోల్చడం లాంటిది. నేను అలా ఎందుకు చెబుతున్నానంటే, చట్టమైన ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 33ఎ ప్రకారం రెండేండ్లకు పైబడిన శిక్ష కేసులను మాత్రమే వెల్లడించాలి. కానీ అన్నింటికంటే ముఖ్యంగా, అభియోగాలు నమోదు చేసిన కేసులను మాత్రమే వెల్లడించాలి. ఆరోపణలు నమోదు చేసే ప్రక్రియ ఒక న్యాయ ప్రక్రియ. ఒక న్యాయమూర్తి ఆరోపణలను నమోదు చేస్తారు. మొదటి సంవత్సరం న్యాయ విద్యార్థికి తెలిసినట్లుగా, మొదట ఒక వ్యక్తిగత ఫిర్యాదు ఉంటుంది. ఆ వ్యక్తిగత ఫిర్యాదు నిరాధారమైనది కావచ్చు. దానికి ఎటువంటి ఆధారం లేకపోవచ్చు. రెండో దశలో మేజిస్ట్రేట్ దానిని విచారణకు స్వీకరిస్తారు’’ అని అన్నారు. అయితే కేసును ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో కోర్టుకు తెలియజేయడానికి హాజరు కావాలని మాత్రమే నటరాజన్కు నోటీసు అందిందని, కేసును పరిగణనలోకి తీసుకోకముందే ఆ నోటీసు అందిందని అన్నారు. ప్రయివేటు ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోలేని కారణంగా, ఆమె పై ఎటువంటి కేసు పెండింగ్లో లేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రిట్నరింగ్ ఆఫీసర్ నిర్ణయం చాలా పేలవంగా ఉందని, ఏకపక్షంగా కూడా ఉన్నట్లు సింఘ్వీ ఆరోపించారు. చట్టపరంగా గుర్తింపు లేని ఏ క్రిమినల్ కేసుకు ఉనికి ఉండదని మొదటి సంవత్సరం లా విద్యార్థికి కూడా తెలుసని అన్నారు. వాస్తవానికి పరిశీలనలో లేనప్పటికీ, ఉందని చెబుతూ రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం వింతగా ఉందని పేర్కొన్నారు.
నేడు ఏఐసీసీ అత్యవసర సమావేశం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ అత్యవసరంగా సమావేశమవుతోంది. ఢిల్లీలోని ఇందిరా భవన్లో నేడు ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అత్యవసర సమావేశం ప్రధాన ఎజెండా ఏమిటనేది పార్టీ అధిష్ఠానం ఆ సర్క్యులర్లో పేర్కొనలేదు. అయితే మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ్య నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చిన అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానుందని, దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉత్తర్వును రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -



