అక్టోబర్ 4 నుంచి 2027 వన్డే వరల్డ్కప్!
న్యూఢిల్లీ : ఐసీసీ 2027 వన్డే వరల్డ్కప్ దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలో జరుగనుండగా.. మెగా ఈవెంట్ షెడ్యూల్ను ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఖరారు చేసినట్టు సమాచారం. 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు వన్డే ప్రపంచకప్ నిర్వహణకు ఐసీసీ బోర్డు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే, జులైలో ఎడిన్బర్గ్లో జరిగే సమావేశంలోనే ప్రపంచకప్ తేదీలను (షెడ్యూల్)ను ఐసీసీ అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. 2003 తర్వాత తొలిసారి ఆఫ్రికాలో ఐసీసీ వన్డే వరల్డ్కప్ జరుగనుండగా.. మూడు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం అందించనున్నాయి. గత రెండు ప్రపంచకప్లలో పది జట్లు మాత్రమే పోటీపడగా.. 2027 ప్రపంచకప్లో 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఏడేసి జట్లు గ్రూప్ దశలో తలపడనుండగా.. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్సిక్స్కు చేరుకుంటాయి. టోర్నమెంట్లో మొత్తం 54 మ్యాచ్లు ఉండగా.. అందులో సుమారు 41 మ్యాచ్లు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. 8-10 మ్యాచ్లు జింబాబ్వేలో.. 3-5 మ్యాచ్లు నమీబియాలో నిర్వహించనున్నారు. ఈ వివరాలను ఐసీసీ జులైలో ఖరారు చేయనుంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్కప్ భారత్లో జరుగగా ఆస్ర్టేలియా చాంపియన్గా నిలువగా.. ఆతిథ్య టీమ్ ఇండియా రన్నరప్తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ 2027-31 ఎఫ్టీపీ ప్రణాళికలో 2027 వన్డే వరల్డ్కప్ తొలి ఈవెంట్ కానుంది.
14 జట్లు…54 మ్యాచ్లు
- Advertisement -
- Advertisement -



