Monday, June 15, 2026
E-PAPER
Homeదర్వాజయేరు ఊరు దాటింది!

యేరు ఊరు దాటింది!

- Advertisement -



పంచ భూతాత్మకం దేహం
పంచ రుణాత్మకం జీవం
ఏరు తీరుస్తుంది దాహం
ఊరు మారుస్తుంది జీవనం
​ఏరు ఎక్కడ పుట్టినా ఊరు ఎక్కడ విస్తరించినా
నేలపై కొత్త ‘గీత’లను లిఖిస్తాయి…
** *** **
​అతను ఏరులా ప్రవహించినవాడు —
జన హితమే మతంగా కాలే కడుపులకి
బతుకు మెతుకుని పంచుతూ,
బుద్ధి జీవులలో అభ్యుదయవాదాన్ని పాదుకొల్పి
నిరంతర సాహిత్య సేద్యం చేసినవాడు …
​అతను ఊరులా స్పందించినవాడు..
పుట్టిన మట్టిలోని మిరప గుణాన్ని
ఎర్రగా అక్షరాల్లో కూర్చుకున్నాడు..
ఎర్రెర్రని జెండాని పట్టుకొని వూరిపాటలు పాడుతూ
నిజామ్ గడ్డమీదకు ‘లాంగ్ మార్చ్’ చేసాడు..
​నీరసంగా ఉన్న లోకానికి ‘అరసం’ రెక్కలు తొడిగి
కాలాన్ని పోరుబాట పట్టించినవాడు..
​శాంతి సభల్లో శ్రీశ్రీకి గొడుగై
విస్మృత కవి శిష్ట్లాకి వెలుగు తోడై
జనం నుండి జనంలోకి అక్షర సముద్రమై వెల్లువెత్తాడు..
​నడిచే పుస్తకమై ‘శివయ్య’ను ‘మార్క్స్’ను
ఒక్కచోట కూర్చోపెట్టి,
‘ప్రజావాణి ‘నే తన వాణిగా , ‘విశాలాంధ్రనే ‘తన బాణీ గా
‘నవచేతన ‘నే తన సర్వస్వంగా ఆవాహన చేసుకున్నాడు..
​తాపీ ధర్మారావు జీవన సారాన్ని పరిశోధించి,
అరసం పత్రాలను లోకార్పితం చేసి,
‘కన్యాశుల్కం’ కావ్యానికి నూరేళ్ళ పండుగ చేసి,
కవుల స్వదస్తూరిని ‘పోయెట్రీ వర్కుషాప్’లో
శిలాక్షరాలుగా మలచి భాషా భాస్వరమయ్యాడు…
*** *** **
​అవును, ఇప్పడు ఏరు ఊరు దాటింది…
మరో ప్రపంచం లోని మరో ఊరును అక్షరాలతో బతికించడానికి!!
( ఏటుకూరి ప్రసాద్ గారి స్మృతిలో )
అయినంపూడి శ్రీలక్ష్మి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -