లీగ్ నిర్వహణకు
బీసీసీఐ అనుమతి లేదు
టీసీఏ ప్రధాన కార్యదర్శి
ధరం గురువారెడ్డి ఆరోపణ
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత క్రికెట నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ధనదాహంతో నిర్వహిస్తున్న టీజీ20 ఓ మోసపూరిత లీగ్, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ లీగ్లో భాగస్వామ్యం అవుతున్న అందరూ క్రిమినల్ కేసులు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి హెచ్చరించారు. టీజీ20 లీగ్ చట్టబద్దత, వ్యాపార, రాజకీయ నాయకుల ప్రమేయంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బుధవారం విలేకరుల సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై గురువారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బోర్డు రూల్స్ ప్రకారం లీగ్ ఆరంభానికి 45 రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలి. మరో 4 రోజుల్లో టీజీ20 ఆరంభం కాబోతున్నా, ఇప్పటికీ అనుమతులు రాలేదు. ఒకవేళ పర్మిషన్స్ ఉంటే హెచ్సీఏ వాటిని బయటపెట్టాలి. కార్పోరేట్ కంపెనీలతో కలిసి హెచ్సీఏ వ్యాపారం చేస్తోంది. అనుమతులు లేని లీగ్ను ప్రమోట్ చేస్తున్న సినీ తారలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్ నాయుడు, మాజీ క్రికెటర్ అంబటి రాయడులకు టీసీఏ తరఫున లీగల్ నోటీసులు పంపించాము. తెలంగాణ పదం వాడే అర్హత హెచ్సీఏకు లేదు. తెలంగాణ క్రికెట్ కోసం టీసీఏ పని చేస్తోంది. కోర్టు కేసులకు ఏడాదికి రూ.6 కోట్లు ఖర్చుపెడుతున్న హెచ్సీఏ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు రూపాయి కేటాయించటం లేదని’ గురువారెడ్డి విమర్శించారు.



