బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి : ప్రధానికి ‘కాక్రోచ్’ పార్టీ చీఫ్ లేఖ
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీక్ల వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణ లోపాల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయనీ, నీట్ బాధిత కుటుంబీకులకు రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రవేశ పరీక్షల వివాదాల వల్ల ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని దీప్కే డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నదని, దీని వల్ల ఆ విద్యార్థుల మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు పేర్కొన్నారు. భారమైన హృదయంతో లేఖ రాస్తున్నానని, మన భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారిన ఈ అంశంపై ప్రధాని తక్షణమే స్పందించాలని కోరారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వేడుకున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు వివరించారు. అందులో ఐదు మరణాలు గత 48 గంటల్లోనే సంభవించాయని పేర్కొన్నారు. గత రెండు నెలల్లో ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల కుటుంబాలను తాను వ్యక్తిగతంగా కలుసుకున్నానని వివరించారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ సంఘటనలు, రీ-టెస్ట్ ఒత్తిడికి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఉసురు తీసుకుంటున్న విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర మానసిక ఆందోళనను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు.
ఈ ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ ఘోరమైన ధోరణి తగ్గకపోగా, మరింత తీవ్రమవుతోందని వివరించారు. ఈ విషయంలో ప్రధాని మోడీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. రీ-ఎగ్జామ్పై అపనమ్మకం ఏర్పడడం వల్ల విద్యార్థుల్లో ఆందోళన ఎక్కువైందని పేర్కొన్నారు. జీవితం మొత్తం కష్టపడి పిల్లలను చదవిస్తే, ఆ కుటుంబాలు ఇప్పుడు పిల్లల్ని కోల్పోతున్నాయని అభిజిత్ దీప్కే ఆందోలన వ్యక్తం చేశారు. పిల్లలను కోల్పోయినా.. భరించలేని మానసిక వేదనతో పాటు, ఈ కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయాయని పేర్కొన్నారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం చాలా కుటుంబాలు పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నాయని, అయితే విద్యా వ్యవస్థలోని లోపాలతో వారి ఆశలు ఆడియాశలయ్యాయని వివరించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యాపరమైన నిరాశ కారణంగా ఇకపై ఏ యువ విద్యార్థి బలికాకుండా ఉండేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావలని ప్రధాని మోడీకి సూచించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జవాబుదారీతనంతో ఉండాలని కోరారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నేడు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన
కాక్రోచ్ జనతాపార్టీ నేడు రెండోసారి తన నిరసన ప్రదర్శనను చేపట్టనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన నిరసనలను కొనసాగించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చింది. అంతకుముందు, జూన్ 6న చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలు, నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకల ఆరోపణలపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, మొదటి నిరసనకు మంచి స్పందన రావడంతో, ప్రస్తుతం ఉద్యమాన్ని దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించాలని సీజేపీ యోచిస్తోంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది.



