Monday, June 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీ వర్ష సూచన..హైదరాబాద్‌లో ఉద్యోగులకు, విద్యార్థులకు కీలక సూచనలు

భారీ వర్ష సూచన..హైదరాబాద్‌లో ఉద్యోగులకు, విద్యార్థులకు కీలక సూచనలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ, నీటి నిల్వ సమస్యలను నివారించేందుకు గాను కీలక సూచనలు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలోని కంపెనీలు, ఇతర కార్యాలయాలు, విద్యాసంస్థలు సోమవారం నుంచి సాయంత్రం 3:30 గంటల నుంచే ఉద్యోగులను, విద్యార్థులను విడతల వారీగా ఇళ్లకు పంపాలని సూచించారు.

భారత వాతావరణ శాఖ కథనం ప్రకారం, రాష్ట్రంలో జూన్ 27 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జూన్ 24 వరకు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గతంలో భారీ వర్షాల కురిసిన సమయంలో గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. ఈ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉద్యోగులందరూ ఒకేసారి కార్యాలయాల నుంచి బయటకు రావడం వల్ల కలిగే రద్దీని నివారించేందుకే ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు పేర్కొన్నారు.

సోమవారం మధ్యాహ్నం వరకు నగరంలో భారీ వర్షం నమోదు కానప్పటికీ, రానున్న రోజుల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -