ఒమన్పై 9 వికెట్లతో ఊరట విజయం
పల్లెకెలె : జింబాబ్వే, శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయాలతో టీ20 ప్రపంచకప్ సూపర్8కు దూరమైన అగ్ర జట్టు ఆస్ట్రేలియా.. వెళ్తూ వెళ్తూ ఊరట విజయం సాధించింది. శుక్రవారం పల్లెకెలెలో జరిగిన గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్లో ఒమన్పై 9 వికెట్ల తేడాతో ఫటాఫట్ విజయం అందుకుంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (64 నాటౌట్, 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు), ట్రావిశ్ హెడ్ (32, 19 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్కు 8.1 ఓవర్లలో 93 పరుగులు జోడించి కంగారూ లేని విజయాన్ని కట్టబెట్టారు.
హెడ్ నిష్క్రమించినా.. జోశ్ ఇంగ్లిశ్ (12 నాటౌట్, 6 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ మార్ష్ లాంఛనం ముగించాడు. మరో 10.2 ఓవర్లు ఉండగానే ఆసీస్ (108/1)తో గెలుపొందింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 16.2 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ ఆడం జంపా (4/21), గ్లెన్ మాక్స్వెల్ (2/13), జేవియర్ బార్ట్లెట్ (2/27) వికెట్ల వేటలో విజృంభించారు. ఒమన్ తరఫున వసీమ్ అలీ (32, 33 బంతుల్లో 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.



