బాగ్లింగంపల్లి గోదాములో స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మహత్తర సంకల్పంతో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బియ్యం నాణ్యతా విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఉన్న సివిల్ సప్లరు గోదాములను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలపాటు గోదాములో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యంలో నూకలు, తేమ శాతం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదాముకు వచ్చిన బియ్యాన్ని స్వీకరించే సమయంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిల్వలను తిరస్కరించాలని గోదాం ఇన్చార్జిలను ఆదేశించారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడినా కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ప్రజలకు చేరే ప్రతి బియ్యం గింజ నాణ్యమైనదిగా ఉండేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సరఫరా వ్యవస్థలో పారదర్శకత కోసం స్టాక్ రిజిస్టర్లు, ఇన్వర్డ్, అవుట్వర్డ్ వివరాలను, రవాణా రికార్డులను కమిషనర్ పరిశీలించారు. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పని వాతావరణం, సౌకర్యాలపై హమాలీలతో మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘ప్రజల విశ్వాసమే మా బలం.ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, నాణ్యతే ప్రమాణం కావాలి. రేషన్ బియ్యం విషయంలో చిన్న తప్పిదం కూడా సహించబోం’ అని తెలిపారు. ఈ తనిఖీలో హైదరాబాద్ జిల్లా మేనేజర్ కె. సాయిఅరుణ్, అదనపు మేనేజర్ దీప్తి, గోదాం ఇన్చార్జిలు గోపాలకష్ణ, కిరణ్ తదితరులు ఉన్నారు.
రేషన్ బియ్యం నాణ్యతలో రాజీపడొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


