Tuesday, February 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి

అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి

- Advertisement -

నిబంధనల పేరుతో కోతపెట్టొద్దు
డెస్క్‌ జర్నలిస్టులందరికీ ఇవ్వాలి
జీవోలో సవరణలు చేయకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం
డీజేఎఫ్‌టీ, పలు జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌
ఐ అండ్‌ పీఆర్‌ కమిషనరేట్‌ ఎదుట జర్నలిస్టుల ధర్నా
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్‌ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, వారికి అక్రిడిటేషన్లు పెంచాలనీ డెస్క్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్‌ డిమాండ్‌ చేశారు. డెస్క్‌ జర్నలిస్టుల అక్రెడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఐ అండ్‌ పీఆర్‌ ఆఫీసు ఎదుట డీజేఎఫ్‌టీ ఆధ్వర్యంలో పలు జర్నలిస్టు సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఐ అండ్‌ పీఆర్‌ అధికారి జగన్‌కు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాకు టీడబ్ల్యూజేఎఫ్‌, టీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజే (143), హెచ్‌యూజే మద్దతు ప్రకటించాయి. అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, నిబంధనల పేరుతో కోతలు పెట్టడానికి అంగీకరించబోమని, గతంలో ఇచ్చిన వారికి తగ్గించడానికి వీల్లేదని, అనర్హులు ఉంటే తొలగించాలని కోరారు. జీవోలో సవరణ చేశాకే ప్రభుత్వం, అధికారులు ముందుకు కదలాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ప్రతి జిల్లాకు ఐదుగురికి, ఎడిషన్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు కేవలం ఎడిషన్‌ సెంటర్‌కు నాలుగు అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమన్నారు. ఈ నిబంధనతో చాలా మంది డెస్క్‌ జర్నలిస్టులు అక్రెడిటేషన్‌ కార్డులకు దూరం అవుతున్నారని తెలిపారు. ఒక్కో ఎడిషన్‌లో మూడు నుంచి ఆరు జిల్లాలున్నాయనీ, వాటికి అనుగుణంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జీవో ప్రకారం ఎడిషన్‌కు నాలుగు కార్డులే ఇస్తే కనీసం ఆ జిల్లాల ఇన్‌చార్జిలకు కూడా అక్రెడిటేషన్లు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. హైదరాబాద్‌ సిటీకి కూడా ఆరు కార్డులే ఇస్తున్నారనీ, ఇక్కడ కనీసం 17 నుంచి 18 మంది పని చేస్తున్నారని చెప్పారు. పైగా ఇప్పుడు హైదరాబాద్‌ మూడు కమిషనరేట్లుగా మారడంతో పేజీలు కూడా పెరుగుతున్నాయన్నారు. దాంతో డెస్క్‌ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు.

ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేసే డెస్క్‌ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్లను 12 నుంచి 8కి తగ్గించారని చెప్పారు. వారికి కూడా 15 కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డీజేఎఫ్‌టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్‌, కార్యదర్శి గండ్ర నవీన్‌ మాట్లాడుతూ.. డీజేఎఫ్‌టీ సంఘానికి మొదట నుంచీ హెచ్‌యూజే, టీడబ్ల్యూజేఎఫ్‌ అండగా ఉన్నదని చెప్పారు. డెస్క్‌ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం డీజేఎఫ్‌టీ చేసే భవిష్యత్‌ పోరాటాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనర్హులను ఏరివేయడానికి సహకరిస్తాం.. కానీ, అర్హత కలిగిన ఒక్క జర్నలిస్టుకైనా అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్‌ అలీ మాట్లాడుతూ.. అక్రెడిటేషన్ల మంజూరు విషయంలో వివక్ష తగదన్నారు. డెస్క్‌ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల అక్రెడిటేషన్ల విషయంలో బయట వ్యక్తుల ప్రమేయంతోనే గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, కోశాధికారి యోగి మాట్లాడుతూ గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్డుల కోసం జర్నలిస్టులు రోడ్లపైకి వచ్చే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రెడిటేషన్ల విషయంలో అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలనీ, లేకుంటే జర్నలిస్టు సంఘాలను కలుపుకుని సచివాలయ ముట్టడితోపాటు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వెనకాడబోమని స్పష్టం చేశారు. హెచ్‌యూజే అధ్యక్షులు అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. డీజేఎఫ్‌టీ రాష్ట్ర నాయకురాలు విజయ మాట్లాడుతూ.. డెస్క్‌ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్‌ కారదర్శి దామోదర్‌, టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌ ఇన్‌చార్జి నవీన్‌ కుమార్‌ యారా, డీజేఎఫ్‌టీ నాయకులు లలిత, నిస్సార్‌, దొడ్డి శేఖర్‌, ఓగోటి కిరణ్‌ కుమార్‌, హెచ్‌యూజే కార్యదర్శి జగదీష్‌, డెస్క్‌ జర్నలిస్టులు వినోద్‌రావు, మనీష్‌, శంకర్‌, బిక్షమయ్య, మధుబాబు, రమేష్‌, రవి, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లో డెస్క్‌ జర్నలిస్టుల ధర్నాలు
రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో కోతలు విధించొద్దని, ఆంక్షలు పెట్టొద్దని టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘు డిమాండ్‌ చేశారు. రెట్టింపు అక్రిడిటేషన్‌ కార్డులు ఇస్తామని చెప్పి నేడు ఉన్నవాటిలో ఎందుకు కోతలు విధిస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా డీజేఎఫ్‌టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్‌ ఖదీర్‌, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, డెస్క్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ర్యాలీగా కలెక్టరేట్‌ వరకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురుశెట్టికి వినతి పత్రం సమర్పించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌, వరంగల్‌ తదితర జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -