– కిన్లే నీళ్ల దోపిడీని ఆపండి
నవతెలంగాణ-సత్తుపల్లి : స్థానిక యువత పొట్టగొట్టి సింగరేణిలో పరాయి ప్రాంతాల వారికి ఉపాధిని కట్టబెట్టడాన్ని సహించేది లేదని, కిన్లే పరిశ్రమ సాగిస్తున్న భూగర్భ జలాల దోపిడీపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దోజు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో ఆ సంఘ నాయకుడు అజయ్ అధ్యక్షతన జరిగిన ఏఐవైఎఫ్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. సింగరేణిలో స్థానికేతరుల పెత్తనానికి చెక్ పెట్టి, ఇక్కడి నిరుద్యోగ యువతకే వంద శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొడదామన్నారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్న కేంద్రం, రెండు లక్షల కొలువులన్న రాష్ట్రం యువతను నట్టేట ముంచాయని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చాక మాట తప్పిన పాలకుల తీరు అత్యంత దుర్మార్గమన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉధృత పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దండు ఆదినారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, సీపీఐ మండల కార్యదర్శి తడికమళ్ల యోబు పాల్గొన్నారు.



