నవతెలంగాణ-మద్నూర్
అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ ప్రజల్లో దెగ్లూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆస్పత్రి ఆర్థోపెడిక్ వైద్యులుగా పనిచేస్తున్న డాక్టర్ అమిత్ ను ప్రతిష్టాత్మక బెస్ట్ డాక్టర్ అవార్డు వరించింది. డాక్టర్ అమిత్ మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వాసపత్రిలో వైద్యులుగా ఇంతకుముందు విధులు నిర్వహించారు. ఆ తర్వాత దెగులూర్ పట్టణంలో ప్రైవేటు గా పెద్ద ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఆర్థోపెడిక్ వైద్యులుగా మూడు రాష్ట్రాల ప్రజల్లో మంచి వైద్యునిగా పేరు ప్రతిష్టలు పొందారు. ఈ క్రమంలో మహారాష్ట్ర లోక్మత్ దినపత్రిక డా. అమిత్ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల పట్ల సర్వే నిర్వహించి ఉత్తమ డాక్టర్ గా గుర్తించింది.
ముఖ్యంగా ఈ ప్రత్యేక సర్వేలో ప్రజల ఆదరణ, సేవా దృక్పథం, వైద్య నైపుణ్యం, రోగుల విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని డాక్టర్ అమిత్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాందేడ్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా డీఐజీ, జిల్లా కలెక్టర్ అంబేకర్ చేతుల మీదుగా డాక్టర్ అమిత్కు అవార్డు ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ అమిత్ కుటుంబ సభ్యులు, ఆయన తల్లితో పాటు భార్యను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ అరుదైన గౌరవం పట్ల వైద్య వర్గాలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, స్నేహితులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ అమిత్కు అభినందనలు తెలిపారు. దేగ్లూర్ పట్టణానికి ఈ అవార్డు మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందని పలువురు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నిస్వార్థ సేవలు అందిస్తూ విశ్వసనీయ వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ అమిత్కు లభించిన ఈ అవార్డు యువ వైద్యులకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రతిష్టాత్మకంగా బెస్ట్ డాక్టర్ అవార్డు పొందిన అమిత్ కు పలువురు సన్మానాలు చేశారు.



