
– దంత వైద్య అభివృద్ధికి డాక్టర్ల నిరంతర కృషి
– అందుబాటులోకి వచ్చిన మెరుగైన సేవలు
– నేడు నేషనల్ డెంటల్ డాక్టర్స్ డే
నవతెలంగాణ ప్రత్యేక కథనం
నవతెలంగాణ-గోదావరిఖని : మానవ దేహంలో దంతాల ప్రాధాన్యం అపారమైనది. ఆహారాన్ని నమలడం, పదాల ఉచ్చరణ, స్పష్టత, ముఖకాంతి, వ్యక్తిత్వం ఇవన్నీ దంతాలపై ఆధారపడి ఉంటాయి. దంతాలు కేవలం ఆహారాన్ని నమలడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా జీర్ణం కావడానికి కూడా సహకరిస్తాయి. మనిషి శరీరంలో ఇంత ప్రాధాన్యం ఉన్న దంతాలను కాపాడడంలో దంత వైద్యుల పాత్ర అభినందనీయం. నేడు నేషనల్ డెంటల్ డాక్టర్స్ డే సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన చిరునవ్వు వెనుక వారి కృషి దాగి ఉంది. సమాజంలో దంత ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ, ఆధునిక చికిత్సలను అందిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను వారు మెరుగుపరుస్తున్నారనడంలో సందేహం లేదు. దంత వైద్య విధానాల్లో ఒకప్పుడు ఇప్పడు జరిగిన అభివృద్ధిపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర
దంత వైద్యులు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, ప్రజల్లో దంత ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరైన దంత సంరక్షణ పద్ధతులను నేర్పించడం, ఆధునిక చికిత్సలను అందించడం ద్వారా వారు సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మనిషి ఆరోగ్యంలో కీలకమైన దంతాల పరిరక్షణకు అప్పట్లో చికిత్సలు పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు సాంకేతికతతో పాటు అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
పళ్ళు తీసివేయడం..
ఒకప్పుడు పళ్ళలో తీవ్రమైన నొప్పి లేదా క్షయం ఉన్నప్పుడు, దంతవైద్యులు పళ్ళు తీసివేయడం ప్రధాన పరిష్కారంగా భావించేవారు. ఇది శాశ్వత పరిష్కారం అయినప్పటికీ, పళ్ళు కోల్పోవడం కారణంగా నమలడంలో, మనిషి రూపంలో, ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అప్పట్లో ఇతర చికిత్సా మార్గాలు పరిమితంగా ఉండటం కారణంగా తొలగింపే సాధారణ పద్ధతిగా ఉండేది. ఇది రోగికి తక్షణ ఉపశమనం ఇచ్చేది కానీ దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యేవి.
సిల్వర్ అమల్గమ్ ఫిల్లింగ్స్..
పళ్ళలో గుంటలు (కావిటీస్) పూడ్చడానికి వెండి, పాదరసం, తామ్రం వంటి లోహాల మిశ్రమం ఉపయోగించేవారు. ఇవి బలంగా ఉండి, ఎక్కువకాలం నిలిచేవి. అయితే, రంగు వెండి-బూడిదగా ఉండటం వల్ల సహజంగా కనిపించేవి కావు. ఇప్పట్లో ఆరోగ్యపరమైన ఆందోళనల కారణంగా వీటి వాడకం తగ్గింది.
మాన్యువల్ టూల్స్..
దంత చికిత్సలో ఎక్కువగా చేతితో నడిపే పరికరాలు వాడేవారు. ఇవి నెమ్మదిగా పనిచేసేవి, కాబట్టి చికిత్స ఎక్కువ సమయం పట్టేది. రోగికి నొప్పి, అసౌకర్యం ఎక్కువగా ఉండేది. ఆధునిక ఎలక్ట్రిక్ పరికరాలు రాకముందు ఇవే ప్రధాన సాధనాలు.
పరిమిత నిర్ధారణ..
అప్పట్లో ఎక్స్-రేలు ఉన్నప్పటికీ, స్పష్టత తక్కువగా ఉండేది. దంత సమస్యలను పూర్తిగా గుర్తించడం కష్టమయ్యేది. చిన్న గుంటలు లేదా లోపలి సమస్యలు కనిపించకపోవచ్చు. దీని వల్ల చికిత్సలో తప్పులు జరిగే ప్రమాదం ఉండేది.
హోమ్ రెమెడీస్..
దంత సమస్యలు వచ్చినప్పుడు ఆరోజుల్లో ఉప్పు నీటితో పుక్కిలించడం సాధారణ పద్ధతి. మూలికలు నమలడం, నొప్పి తగ్గించడానికి ఉపయోగించేవారు. ఇవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవి కానీ శాశ్వత పరిష్కారం కాదు. వైద్యసేవలు అందుబాటులో లేని సమయంలో ప్రజలు ఈ విధానాలను అవలంభించేవారు.
ఆధునిక చికిత్సలు : గతంతో పోలిస్తే ఇప్పుడు దంత వైద్యంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి ద్వారా పేషెంట్లకు అధునాతనమైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
లేజర్ ట్రీట్మెంట్…
లేజర్ ట్రీట్మెంట్ పద్ధతిద్వారా నొప్పి లేకుండా చికిత్స చేయొచ్చు. రక్త స్రావం లేకుండా, కుట్లు వేయకుండా చిగుళ్ల సమస్యకు శస్త్ర చికిత్స చేయొచ్చు. దీని ద్వారా గాయం త్వరగా మానిపోతుంది. ఈ విధానం రోగికి అత్యంత సౌకర్యంవంతంగా ఉంటుంది.
డిజిటల్ ఎక్స్-రేలు, 3డీ స్కానింగ్…
డిజిటల్ ఎక్స్-రేలు తక్కువ రేడియేషన్తో స్పష్టమైన చిత్రాలు ఇస్తాయి. 3డీ స్కానింగ్ ద్వారా దంతాల నిర్మాణం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. చిన్న సమస్యలు కూడా సులభంగా గుర్తించవచ్చు. దీని వల్ల చికిత్సా ప్రణాళిక మరింత ఖచ్చితంగావీ ఉంటుంది.
ఇంప్లాంట్స్..
కోల్పోయిన దంతాలకు ఇంప్లాంట్స్ సహజ దంతాల్లా పనిచేస్తాయి. ఇవి బలంగా ఉండి, నమలడంలో సహజ అనుభూతి ఇస్తాయి. దీర్ఘకాలం నిలిచే పరిష్కారం. రూపం, ఆరోగ్యం రెండింటినీ కాపాడతాయి.
కాస్మెటిక్ డెంటిస్ట్రీ..
దంతాల అందాన్ని పెంచే చికిత్సలు ఇందులో ఉంటాయి. వైట్నింగ్ ద్వారా పళ్ళు తెల్లగా మారతాయి. వెనీర్స్తో పళ్ళ ఆకారం, రంగు సరిచేయవచ్చు. ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
పర్సనలైజ్డ్ కేర్ ప్లాన్స్..
ప్రతి రోగికి ప్రత్యేకంగా చికిత్సా ప్రణాళిక రూపొందిస్తారు. రోగి అవసరాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి మార్పులు చేస్తారు. దీని వల్ల ఫలితాలు మెరుగ్గా వస్తాయి. రోగి సంతృప్తి, నమ్మకం పెరుగుతుంది.
ఆర్థోడాంటిక్ టెక్నాలజీ..
డిజిటల్ స్కానింగ్, పారదర్శక బేసెస్తో దంతాలను సరిచేయడం ఈ విధానంలో సులభం. పాత పద్ధతుల కంటే వేగంగా, ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. రోగికి సౌకర్యంతంగా ఉంటుంది. దీంతో దంతాల అందం, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. ఈ విధానం ద్వారా రోగికి తినడం, మాట్లాడడం సులభం. సాంప్రదాయ బేసెస్ కంటే అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు యువతలో వీటి వాడకం ఎక్కువగా ఉంది.
దంత పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు ..
రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం.
చక్కెర పదార్థాలు అధికంగా తీసుకోవడం తగ్గించడం.
ఫ్లాస్ ఉపయోగించి దంతాల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని తొలగించడం.
క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించుకోవడం.
పొగాకు, మద్యపానం వంటి అలవాట్లను నివారించడం.
నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా..
ప్రొఫెసర్ ఇన్ ఆర్థోడాంటిక్స్ డాక్టర్ ఈ. శ్రీకాంత్, ఎండీఎస్.
ఇండియన్ ఆర్థో డాంటిక్ సొసైటీ ఆధ్వర్యలో దంత వైద్యంలో వచ్చిన అధునాతన చికిత్స విధానాలు, వివిధ రకాల పద్ధతులను ఎప్పటికప్పుడు వైద్యులందరికీ చేరవేస్తున్నారు. ఆర్థో డాంటిక్ కాన్ఫరెన్సులు, వర్క్షాపుల ద్వారా డెంటల్ హెల్త్ ప్రొటెక్షన్ కోసం ఈ సొసైటీ కృషి చేస్తోంది. రాష్ట్రాల వారీగా నూతన పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. దంత వైద్య పరిశోధన, లెక్చర్స్ ద్వారా నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తినందిస్తూ వైద్యులను ఈ సొసైటీ ప్రోత్సహిస్తోంది. వాటిని అనుసరిస్తూ నూతన వైద్య విధానంలో భాగంగా శ్రీకాంత్ డెంటల్ ఆస్పత్రిలో ఇంట్రా ఓరల్ కెమెరాలు, ఇంట్రా ఓరల్ స్కానర్ల ద్వారా 3 డైమెన్షనల్ డిజిటల్ ఇంప్రెషన్, ఓపీజీ (ఆర్థో పాన్టమో గ్రామ్), అడ్వన్స్ డెంటల్ ఇంప్లాట్స్ టెక్నాలజీ, డెంటల్ లేజర్ లాంటి విధానాలను గోదావరిఖనిలో అవలంభిస్తున్నాము.



