విజయం సాధించిన మహిళల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలి
మహిళా దినోత్సవం సందర్భంగా డిఈ హేమలత పై ప్రత్యేక కథనం
నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లోని అటవీ ప్రాంతాలు గిరిజన గుడాలలోని ప్రజల దాహం తీర్చడానికి, ఫ్లోరైడ్ రహిత సురక్షిత తాగునీటిని అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ డీఈ హేమలత అనేకంగా శ్రమించారు. చెంచు గుడెలలోని మిషన్ భగీరథ పథకం పథకం ద్వారా పైపులైన్లు తీయడానికి అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వ అనుమతి ద్వారా సోలార్ మోటార్ల ద్వారా అడవి బిడ్డలకు త్రాగు నీటిని అందిస్తున్నారు. అటవీ గ్రామాల్లో బావుల వద్దకు వెళ్లే కష్టాలను తొలగించి, నేడు గిరిజనులు పడ్డ కష్టాలకు ఈ పథకం శాశ్వత పరిష్కారం చూపించారు. అడవులలో పాములు అడవి జంతువుల భయాన్ని లెక్కచేయకుండా, సాంకేతిక సమస్యలను ఎదుర్కొని చెంచు గిరిజనులకు తాగునీటిని అందిస్తున్నారు.
గిరిజన మహిళలు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే కష్టాలు తీరాయి. దీంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. బోర్లు డ్రిల్ వేసి సోలార్ ప్లేట్లు బిగించారు. అటవీ ప్రాంతంలో స్థిరమైన అభివృద్ధిని మరియు ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించారు. లింగాల, ఉప్పునుంతల, అమ్రాబాద్, బల్మూరు, అచ్చంపేట మండలాలలో 210 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ప్రాథమిక సరఫరా చేస్తున్నారు. డివిజన్ లో పాత ట్యాంకులు 170 ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా మరి 161 నిర్మించారు. 20 లీటర్ల నుంచి కొన్ని వేల లీటర్ల సామర్ధ్య గల వాటర్ ట్యాంకులు నిర్మించారు. అచ్చంపేట డివిజన్ లో 60 వేలకు పైగా నల్లాలు బిగించారు. వాటి నిర్వహణ ఆయా గ్రామ పంచాయతీలు చూసుకుంటున్నాయని తెలిపారు.
మారుమూల గిరిజన చెంచు పెంట లలో త్రాగునీరు అందించేందుకు కృషి చేశారు. ఉత్తమ అధికారిగా గుర్తించి కలెక్టర్ అభినందించారు. ప్రశంస పత్రాన్ని అందజేశారు. 2022లో మార్చిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అప్పాపూర్ చెంచుపెంటలో పర్యటించారు. చెంచులను ప్రత్యేకంగా త్రాగునీరు సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతటి దట్టమైన అడవిలో త్రాగునీరు అందిస్తున్న డి ఈ హేమలతను అభినందించారు. సమాజ సేవలో భాగంగా తమ వంతుగా అటవీ ప్రాంతంలో నివాసముంటున్న చెంచులకు కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు.
మహిళ దినోత్సవం సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ డీఈ హేమలత నవతెలంగాణ తో మాట్లాడారు. స్త్రీ లేనిది సృష్టి లేదు….జననం లేదు..అమ్మగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా , సమాజ నిర్మాణంలో కేంద్ర బిందువు మహిళా అని అన్నారు. మానవ బంధాలను సంబంధాలుగా కలుపుతూ.. సృష్టిలో విడదీయని బంధం మహిళ ఏర్పాటు చేస్తుంది. వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి మహిళ దైర్యంగా సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ఒకప్పుడు వంటగదికి పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షంలో విమానాలు నడుపుతున్నారు అని గుర్తు చేశారు. బూజు పట్టిన పితృ స్వామ్య భావజాల బంధాలను ఛేదించుకుంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తుపై కోటి ఆశలతో అన్ని రంగాలలోకి మహిళలు ప్రవేశించాలన్నారు.
మహిళలకు విద్యా, ఆరోగ్యం, పోషకమైన ఆహారం అందించడానికి, మాతృ, శిశు మరణాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విశేష కృషి చేయాలని సూచించారు. సమాజంలో పురుషులతో పాటు సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలని భారత రాజ్యాంగం చెబుతుంది. చట్టం ముందు అందరూ సమానులే అని భారత శిక్షాస్మృతి చెబుతుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆకాశంలో సగం…ఆవనిలో సగం అవకాశాలున్న మహిళలు అడ్డంకులను అధిగమించి సమాజ మార్పుకు బీజం వేయాలని సూచించారు.



