Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

- Advertisement -

–  కామారెడ్డి జిల్లాలో 2.46 లక్షల మంది బాలబాలికలకు ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ
నవతెలంగాణ – కామారెడ్డి : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 13న జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 2,46,177 మంది బాలబాలికలకు ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె. వెంకటి తెలిపారు. ఆ రోజు మాత్ర తీసుకోలేని వారికి ఈ నెల 20న ప్రత్యేక పునఃపంపిణీ కార్యక్రమం నిర్వహించి తప్పనిసరిగా మాత్రలు అందజేస్తామని వెల్లడించారు. నులిపురుగులు పిల్లల శరీరంలోని పోషకాలను గ్రహించి రక్తహీనత, పోషకాహార లోపం, బరువు తగ్గడం, ఎదుగుదల మందగించడం, శారీరక బలహీనత, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతాయని తెలిపారు. కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారం, మురికి చేతులు, చెప్పులు లేకుండా తిరగడం, బహిరంగ మలవిసర్జన వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన సురక్షితమైన ఆల్బెండాజోల్ మాత్రను తీసుకోవడం ద్వారా పేగుల్లోని నులిపురుగులు నశించి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడటంతో పాటు రక్తహీనత తగ్గుతుందని వివరించారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల, కస్తూర్బా, ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలకు వెళ్లని పిల్లలందరికీ ఈ కార్యక్రమం ద్వారా మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను పొడి చేసి, రెండు నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారికి 400 మిల్లీగ్రాముల పూర్తి మాత్రను నమిలి మింగేలా అందజేస్తారని చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు పంపిణీ చేస్తారని తెలిపారు. పిల్లలకు మాత్రలు వేయించడంతో పాటు పరిశుభ్రత పాటించడం కూడా అత్యంత అవసరమని సూచించారు. భోజనం ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు చిన్నగా ఉంచుకోవడం, చెప్పులు ధరించడం, పరిశుభ్రమైన తాగునీరు వినియోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండడం వంటి అలవాట్లు నులిపురుగుల నివారణకు దోహదపడతాయని తెలిపారు.

వైద్య, ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జూలై 13న ప్రతి అర్హులైన బాలబాలిక ఆల్బెండాజోల్ మాత్ర తీసుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని, ఆ రోజు తీసుకోలేకపోయిన వారు జూలై 20న నిర్వహించే ప్రత్యేక పునఃపంపిణీ కార్యక్రమంలో తప్పనిసరిగా మాత్ర తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె. వెంకటి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -