నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు బి. రాజ్ కుమార్ (35) సోమవారం శవమై తేలిన సంగతి తెలిసిందే. కొత్తూరు మండలం, పెంజర్ల గ్రామ శివార్లలోని ఓ వెంచర్ వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహం వద్ద విషం బాటిల్ లభ్యం కావడంతో, అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో ఈ కేసు విషాదాంతంగా ముగిసింది.
ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు అత్యంత కీలకమైన ఆధారం లభించింది. రాజ్ కుమార్ మృతదేహం వద్ద స్వాధీనం చేసుకున్న అతని మొబైల్ ఫోన్లో ఒక సెల్ఫీ వీడియోను గుర్తించారు. హత్యలకు పాల్పడటానికి ఒకరోజు ముందు, అంటే జులై 10వ తేదీ సాయంత్రం 4:55 గంటలకు ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు తేలింది.
తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారని, ముఖ్యంగా పోక్సో కేసుకు కారణమైన అమ్మాయి కుటుంబం తనను ఆర్థికంగా నిండా ముంచిందని వీడియోలో రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. వారు తనను ఆర్థికంగా వాడుకున్నారని ఆరోపించాడు. తన సంపాదనలో సగం వారికే ఇచ్చానని, వారి వల్ల అప్పుల పాలై ఆస్తులు కోల్పోయానని, తన పిల్లల భవిష్యత్తు నాశనమైందని వాపోయాడు. తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని, ఈ ద్రోహానికి ప్రతీకారంగానే ఈ హత్యలకు పాల్పడుతున్నానని పేర్కొన్నాడు.



