– చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
చేతి వృత్తిదారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్. వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేతి వృత్తిదారుల సంక్షేమం కోసం కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని విమర్శించారు. ఫెడరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని అన్నారు. రోజువారీగా వృత్తులు చేస్తూ జీవిస్తున్న చేతి వృత్తిదారులకు సరైన ప్రోత్సాహం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, 50 సంవత్సరాలు పైబడిన వృత్తిదారులందరికీ నెలకు రూ.4 వేల పెన్షన్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే అన్ని రకాల వృత్తిదారులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మార్చిలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో చేతి వృత్తిదారుల అభివృద్ధికి రూ.25 వేల కోట్లు కేటాయించాలని, బీసీ సబ్ప్లాన్ చట్టం చేయాలని, బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ మాట్లాడుతూ మత్స్య కార్మిక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని, వృత్తిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పండరి, రాజు, మణెమ్మ, సాయవ్వ, రాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.



