నవతెలంగాణ – కామారెడ్డి
మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మృతి చెందారు. వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి మోహన్ రెడ్డి మంగళవారం హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనతో పాటు వాహనంలో ఆయన బంధువులు మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసింది.
ఈ ప్రమాదంలో రామారెడ్డి మండలానికి చెందిన నవతెలంగాణ విలేకరి తిరుపతి రెడ్డికి గాయాలైనట్లు సమాచారం. నారెడ్డి మోహన్ రెడ్డి సామాజిక సేవలో ముందుండేవారు. నా రెడ్డి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి గ్రామంలో, మండలంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, పేదలకు బియ్యం పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. దీంతో ఆయనను రామారెడ్డి మండలంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభిమానించేవారు. ఆయన మృతితో రామారెడ్డి మండలంతో పాటు కామారెడ్డి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నారెడ్డి మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడని, దశాబ్ద కాలంగా పార్టీలో కొనసాగుతూ తనతో కలిసి పనిచేశారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.



