ఇప్పటికే కేజీబీవీ పిల్లలకు అందిన దుస్తులు
చకచకా సాగుతున్న కుట్టు పని
నాణ్యమైన యూనిఫారాల అందజేతే ప్రభుత్వం లక్ష్యం
విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జెండాపండుగ ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ యూనిఫారాలను అందించడమే ల క్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థులకు మన్నికైన యూనిఫారాలు ధరిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా నాణ్యమైన వస్త్రంతో తయారు చేయిస్తోంది. విద్యా ర్థులకు అందజేసే యూనిఫారాలకు సంబంధించిన వస్త్రం సరఫరా మొదలు కుట్టు పని వరకు ప్రతి దశలోనూ నాణ్య తకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో గతంలో ఎన్న డూ లేని విధంగా విద్యార్థులకు మఫత్లాల్ వంటి పేరుగాంచిన సంస్థ నుంచి యూనిఫారాల వస్త్రాన్ని సేకరించింది.
విద్యార్థులకు షూ, సాక్సులు, టై, బెల్టులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లోని 85 వేల మంది విద్యార్థినులకు మన్నికైన యూనిఫారం వస్త్రం చేరింది. పాఠ శాలలు, గురుకులాలకు వచ్చేనెల 15 నాటికి పూర్తి స్థాయిలో యూనిఫారాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మును పెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రాండెడ్ షూ, సాక్సులు, టై, బెల్టులు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులకు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కూడిన యూనిఫారాలతోపాటు స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు మైనార్టీ కళాశాలల్లో విద్యార్థులకు యూనిఫారాలతోపాటు టై, బెల్టులు, సాక్సులను అందించింది.
గతంలో గందరగోళం
గతంలో పాఠశాల విద్యా విభాగం, ఏ గురుకుల విభాగానికి ఆ గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామగ్రి వేర్వురుగా కొనుగోలు చేసి అందజేసే విధానం ఉండేది. దాంతో అనేకరకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. కొన్ని పొరపాట్లు జరిగేవి. ఆ సమస్యలను అధిగమించి సామగ్రి సేకరణ, పంపిణీ ఒకే విధంగా ఉండేలా ఈ ఏడాది ప్రభుత్వం కేంద్రీకృత సేకరణ విధానాన్ని తెచ్చింది. ఇందుకోసం రూ.687.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై పెట్టే అభివృద్ధి వ్యయంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
వేగంగా కుట్టు పని
రాష్ట్రంలో మొత్తం 27 లక్షల మంది విద్యా ర్థులకు రెండు జతలకు సంబంధించి 2.97 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మఫత్లాల్ కంపెనీ 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ 55.32 లక్షల మీటర్ల వస్త్రం సరఫరా చేస్తున్నాయి. ఈ బట్టను స్థానికంగా ఉండే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫారాలను ప్రభుత్వం కుట్టిస్తున్నది. ఒక్కో యూనిఫారానికి ప్రభుత్వం రూ.75 చెల్లిస్తున్నది. రాష్ట్రంలో మహిళా సంఘాలకు రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫారాలు కుట్టే సామర్థ్యం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యూనిఫారాల కుట్టుపని వేగవంతమైంది. వచ్చేనెల 15 నాటికి అన్ని పాఠశాలలు, గురుకులాలకు అందజేయడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
చేనేత కార్మికులకు ఆదాయం
యూనిఫారాలు, బెడ్డింగ్కు సంబంధించి 25 శాతం 30 శాతం వరకు ఆర్డర్లను తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇందులో 25 శాతం యూనిఫారం వస్త్రం (సుమారు 56 లక్షల మీటర్లు), 100 శాతం దుప్పట్లు (6,49,381), మూడు లక్షల బెడ్షీట్లు, 2.29 లక్షల కార్పెట్లు ఉన్నాయి. ఈ ఆర్డర్తో చేనేత కార్మికులకు ఆదాయం సమకూరనుంది. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల ఆర్డర్ను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ ఆర్డర్తో ఆ సంస్థ ఆర్థికంగా బలోపేతం కానుంది.



