చెరువుల్లా మారిన రహదారులు
పలుచోట్ల పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు
ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్
వాహనదారులకు తప్పని కష్టాలు
ప్రజలకు ఇబ్బందులు రాకుండా
చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతం కాగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. మొదట రాజేంద్ర నగర్లో ప్రారంభమైన వాన క్రమంగా నగరమంతా విస్తరిస్తూ వచ్చింది. అక్కడక్కడా భారీగా, కొన్ని చోట్ల మోస్తరుగా కురుస్తూ భాగ్యనగరాన్ని తడిపేసింది.ఒక్కసారిగా కురిసిన భారీవర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముషీరాబాద్లో అత్యధికంగా 31 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
మాదాపూర్, గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వాన నీటితో రోడ్లు మునగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్, కేపీహెచ్బీ మార్గంలో, మాదాపూర్ ఐకియా బయోడైవర్సిటీ మార్గంలో గచ్చిబౌలి రాయదుర్గం మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కిలోమీటర్ దూరానికి గంట సమయం పడుతోంది.
చెరువుల్లా మారిన రోడ్లు
రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్గూడా, ఉప్పరపల్లి, లంగర్హౌస్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో రహదారులు జలమయమయ్యాయి. ఇదే సమయంలో కార్యాలయాలు ముగిసే వేళ కావడంతో రోడ్లపై నీరు నిలిచి చెరువుల్లా మారాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షంలో తడుస్తూనే గమ్యస్థానాలకు
ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నెమ్మదిగా సాగగా, ద్విచక్ర వాహనదారులు వర్షంలో తడుస్తూ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. హైదర్గూడా టీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ కింద, పిల్లర్ నంబర్–216 సమీపంలో రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
రహదారులపై భారీగా నీరు
కేపీహెచ్బీ, నిజాంపేట్, బాచుపల్లి, ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ట్రాఫిక్ సమస్యలతో చాలామంది మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కోఠిలో భారీ వర్షం పడడంతో రహదారులపై భారీగా నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్లో అంబులెన్స్ కొద్దిసేపు చిక్కుకుపోయింది.
మలక్పేట్ రైల్వే అండర్పాస్ వద్ద ట్రాఫిక్ జామ్
దిల్సుఖ్నగర్ ప్రాంతంలో దంచికొడుతున్న వర్షంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోతున్నాయి. దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్ నగర్, కర్మాన్ ఘాట్, మలక్పేట్, చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో పలు రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా చాదర్ఘాట్ నుంచి మలక్పేట్ రైల్వే అండర్పాస్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాదర్ఘాట్ నుంచి మలక్పేట్ రైల్వే అండర్పాస్ వరకు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు.



