- జనరల్ డైరీలో నమోదు చేసిన ఆర్ఎఎఫ్ డిప్యూటీ కమాండర్
నవతెలంగాణ-హైదరాబాద్: జులై 20 సీజేపీ నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళనపై డీసీపీ ఆదేశాల మేరకే పెల్లెట్ గన్లను ప్రయోగించినట్లు జనరల్ డైరీ స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీసుల డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) ఆదేశాల మేరకే రెండు రౌండ్లు పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపినట్లు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోని జనరల్ డైరీలో ఆర్ఎఎఫ్ డిప్యూటీ కమాండర్ నమోదు చేసిన నివేదిక తెలిపింది. ఈపత్రం విద్యార్థుల నిరసనపై పెల్లెట్లను వినియోగించారని ధృవీకరించిన మొదటి పత్రం. నిరసన జరిగిన రెండు రోజుల అనంతరం జులై 22న తెల్లవారుజామున 1.24గంటలకు ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ వివరాలను డైరీలో మోదు చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది.
‘‘20/7/2026 నాటి ఘటనకు సంబంధించి, సిజెపి నిరసన సందర్భంగా ఆందోళనకారులను అదుపు చేయడానికి, జోన్ -1 (జంతర్మంతర్) డిసిపి (నార్త్) రాజాభాటియా ఆదేశాల మేరకు తాము విధుల్లో ఉన్నప్పుడు నాన్ ఎలక్ట్రికల్ షెల్స్ (55), ఎలక్ట్రికల్ షెల్స్ (15), టియర్ గ్యాస్ గ్రెనేడ్లు (5), అల్లర్ల నిరోధక గన్ -ఎఆర్జి (2), బాలిస్టిక్ కాట్రిడ్జ్లు- బిసి(2), ప్లాస్టిక్ పెల్లెట్లు -పిపి(2) రెండు రౌండ్లను వినియోగించాం’’ అని ఆర్ఎఎఫ్ బెటాలియన్ 108కి చెందిన డిప్యూటీ కమాండర్ సతీష్ కుమార్ సాంగ్వాన్, డిఒ కార్యాలయానికి వచ్చి వెల్లడించారు. 0008 నెంబర్తో ఉన్న డైరీలో హిందీలో రాసి ఉంది, సబ్ ఇన్స్పెక్టర్ సంతకం, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముద్ర కలిగి ఉన్నాయి. ఈ ఆరోపణలపై సిఆర్పిఎఫ్ ఇప్పటికే విచారణను ప్రారంభించింది. ఈ నివేదికపై స్పందించేందుకు డిసిపి అందుబాటులో లేరు. ఢిల్లీ పోలీసులు , సిఆర్పిఎఫ్ రెండూ కూడా దీనిపై అధికారికంగా స్పందించడానికి నిరాకరించాయి.
డిసీపీ వివరణ
ఢిల్లీ పోలీసుల అంతర్గత విచారణలో డిసిపి రాజాభాటియా తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో తాను కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ లేదా జంతర్ మంతర్ ప్రాంతంలో లేనని డిసిపి రాజాభాటియా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతర జిల్లాల నుండి పిలిపించిన ఇద్దరు డిసిపి స్థాయి అధికారులను జులై 20న కన్నాట్ ప్లేస్ పరిసరాల్లోని వివిధ సిఆర్పిఎఫ్ బృందాలకు కేటాయించినట్లు తెలిపారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నివేదిక గురించి డిసిపి రాజాభాటియా మాట్లాడుతూ.. జులై 20 మధ్యాహ్నం తాను అశోక్ రోడ్డులోని మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పటేల్ చౌక్, గోల్ డాక్ ఖానాలో విధుల్లో ఉన్నానని చెప్పారు. జూలై 20, 2026 మధ్యాహ్నం పల్లికా బజార్ గాంధీ చక్రం సమీపంలోని ‘అవుటర్ సర్కిల్’ ప్రాంతంలో ఇతర డిసిపి స్థాయి అధికారులు, ఆర్ఎఎఫ్ సిబ్బంది ఉన్నారని అన్నారు. తాను ఆ ప్రాంతానికి దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఘటనల జరిగిన రెండు రోజుల అనంతరం.. సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ తగిన పరిశీలన లేకుండానే జనరల్ డైరీని నమోదు చేశారని డిసిపి విచారణలో పేర్కొన్నట్లు ఆ అధికారి తెలిపారు.



