ఆస్పత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం – ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
నవతెలంగాణ – చండూర్
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సిహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి యాద్రి భువనగిరి, నల్గొండ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై రెండు జిల్లాల వైద్యాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసుపత్రుల అప్గ్రేడేషన్కు ప్రణాళికలు: మునుగోడు, నాంపల్లి పీహెచ్సీలను ఆధునీకరించడంతో పాటు 30 పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలి
మర్రిగూడ సిహెచ్సిని 30 పడకల నుండి 50 పడకలకు పెంచాలి. సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాల కల్పన, పోస్టుమార్టం ఎగ్జామిన్ రూమ్ ఏర్పాటు చేయాలి
– చండూరు రెవెన్యూ కేంద్రంలో 100 పడకలతో ఏరియా ఆస్పత్రి మంజూరు, నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి
– గట్టుపల్ పీహెచ్సికి సిబ్బంది నియామకం, సాంకేతిక పరికరాలకు అంచనాలు రూపొందించాలి
చౌటుప్పల్లో ట్రామా కేర్, 100 పడకల ఆసుపత్రి
జాతీయ రహదారి 65 పై జరిగే ప్రమాదాల్లో గోల్డెన్ అవర్లో హైదరాబాద్ తీసుకెళ్లలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చౌటుప్పల్ ప్రాంతంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు చౌటుప్పల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేసి, ఆధునిక పరికరాలతో అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే ప్రజా వైద్యానికి పెద్దపీట వేయాలని కోరారు.
బడ్జెట్ పెంపుపై మంత్రికి నివేదిక
ప్రస్తుతం గ్రామాల్లో నిర్మిస్తున్న ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల బడ్జెట్, పెరుగుతున్న ధరలు, సాంకేతిక అవసరాలకు సరిపోవడం లేదన్నారు. సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, సిహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల బడ్జెట్ పెంపు విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
డాక్టర్లకు ఎమ్మెల్యే సూచన
“పీహెచ్సీలు, సిహెచ్సీలలో ప్రతి డాక్టరు కమిట్మెంట్తో పని చేయాలి. అన్ని వృత్తుల కంటే డాక్టర్ వృత్తి ఎంతో గొప్పది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దు” అని ఎమ్మెల్యే గారు డాక్టర్లకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా డీఎంహెచ్ఓ రాహుల్, డీసీహెచ్ మాతృనాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్ఓ మనోహర్, డీసీహెచ్ సూర్యశ్రీ తో పాటు మర్రిగూడ, చౌటుప్పల్ సిహెచ్సీ వైద్యాధికారులు, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ వైద్యాధికారులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



