– నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్ష కార్యదర్శులు గా ప్రభాకర్, క్రిష్ణ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ మహాసభలు నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ మహాసభలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా గోకినపల్లి ప్రభాకర్,ప్రధాన కార్యదర్శిగా జాటోత్ కృష్ణ, కోశాధికారిగా బుర్రా వెంకన్న ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా దాసరి సాయి,సహాయ కార్యదర్శిగా నాయిని రాజు ఎంపికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా తెల్లం రాజు, బానోతు లింగా, మంచినీళ్ల భాస్కర్, ఎం. రాజశేఖర్, కంగాల వెంకటమ్మ, కుర్సం ముత్యాలరావు, శాస్త్రబోయిన వెంకటేశ్వర్లు, పోతుగంటి లక్ష్మణ్, కాకా వెంకటేష్, బండి వెంకటమ్మ, చింతకాయల సరళ తదితరులు సహా మొత్తం 17 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మహాసభలో పలు కీలక తీర్మానాలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాత పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగంగా “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” కింద సంవత్సరానికి రూ.12,000 చెల్లించే హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.
అదేవిధంగా కనీస వేతన చట్టాన్ని సవరించి తక్షణమే అమలు చేయాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడాన్ని ఖండించారు. పోడు సాగుదారులపై దాడులను నిలిపివేసి వెంటనే భూములకు పట్టా హక్కులు కల్పించాలని మహాసభ డిమాండ్ చేసింది.
ఈ నెల 24, 25 తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని మహాసభ ప్రజలకు పిలుపునిచ్చింది.



