మాటల్లోనే కాకుండా
ఆచరణలోనూ కనిపించాలి
విద్యార్థులపై అనవసర చట్టపరమైన చర్యలు కొనసాగించొద్దు
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న తమ హామీకి కట్టుబడి ఉన్నామని ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ హామీని అత్యంత బాధ్యతగా అమలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం… ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీ మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కనిపించాలని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా విద్యార్థులపై అనవసరమైన చట్టపరమైన చర్యలు కొనసాగించకూడదని సూచించింది. విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు అంశంపై వివాదం కొనసాగుతుండటంతో, ప్రభుత్వం తన హామీని ఎలా అమలు చేస్తుందనే అంశంపై కోర్టు దృష్టి సారించింది. ఇక విద్యార్థుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న సీజేపీ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ఎఫ్ఐఆర్లనూ పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. హామీలు అమలు కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.
హామీని బాధ్యతగా అమలు చేయండి
- Advertisement -
- Advertisement -



