Wednesday, August 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒత్తిడితోనే పైచేయి

ఒత్తిడితోనే పైచేయి

- Advertisement -

ఇరాన్ తాజా యుద్ధ వ్యూహం
బీరుట్ :
అమెరికాపై ఒత్తిడి పెంచడానికి మధ్యప్రాచ్యంలోని వాణిజ్య – సముద్ర మార్గాలు, ఇంధన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. యుద్ధ వ్యయాన్ని పెంచి అమెరికాను చికాకు పరచడం ద్వారా ఆ దేశంపై పైచేయి సాధించడం కూడా టెహ్రాన్ వ్యూహంలో భాగమేనని గల్ఫ్ అధికారులు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నిర్ణయాత్మక సైనిక విజయం కోసం ప్రయత్నించకుండా…అంటే పూర్తి స్థాయి యుద్ధానికి దిగకుండా సంఘర్షణలను విస్తరించాలని, ఉద్రిక్తతలను పెంచాలని టెహ్రాన్ అనుకుంటోంది. హార్ముజ్ జలసంధి విషయంలో తన డిమాండ్లకు తలవంచడం కంటే సంక్షోభాన్ని అదుపులో ఉంచడమే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అమెరికా, దాని మిత్రదేశాలకు అర్థమయ్యేలా చేయడం ఇరాన్ ఉద్దేశం.

ఇదే టెహ్రాన్ ఎత్తుగడ
హార్ముజ్‌లో తన పట్టును పెంచేందుకు అమెరికా అంగీకరించని పక్షంలో ప్రస్తుత సంఘర్షణ గల్ఫ్‌ను దాటి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుందని ఇరాన్ సంకేతాలు పంపుతోంది. అనేక సముద్ర కీలక మార్గాలను, ఇంధన ఆస్తులను ప్రమాదంలోకి నెట్టడం ద్వారా భవిష్యత్తులో జరిగే చర్చలలో తనదే పైచేయి అయ్యేలా చూసుకోవాలని టెహ్రాన్ భావిస్తోంది. ఇరాన్ మొదటి నుంచి ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నదని, ప్రతి వారం ఓ కొత్త భౌగోళిక ప్రాంతాన్ని, ఓ కొత్త ఆయుధాన్ని, ఓ కొత్త లక్ష్యాన్ని ముందుకు తీసుకొస్తోందని వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మైఖేల్ నైట్స్ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను మ్రాతమే దెబ్బతీస్తే వారికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, ప్రాంతీయ దేశాలను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తేనే వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు.

రాయితీల నుంచి ఒత్తిడి వైపు…
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు వాటాను కలిగిన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకొని తన సామర్థ్యాన్ని నిరూపిం చుకున్న ఇరాన్…ఏ కీలక సముద్ర మార్గం తనకు అతీతం కాదని నిరూపించింది. ఎర్ర సముద్రానికి, సౌదీ ఇంధన మౌలిక సాదుపాయాలకు ఇప్పటికే ముప్పు పొంచి ఉంది. సంఘర్షణలను విస్తృతం చేసి, ఒత్తిడి పెంచితే ట్రంప్ చివరికి లొంగిపోక తప్పదని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. ఇరాన్‌ను దెబ్బతీసి, చర్చల వేదిక వద్దకు రప్పించాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇరాన్‌తో సోమవారం చర్చలు మొదలవుతాయని ట్రంప్ చెప్పగా అలాంటిదేమీ లేదని టెహ్రాన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో అమెరికా నుంచి అధిక రాయితీలు రాబట్టాలని ఇరాన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఇక ఒత్తిడి ద్వారానే కార్యాన్ని చక్కబెట్టుకోవాలని అది నిర్ణయానికి వచ్చింది.

మారిన గల్ఫ్ దేశాల వైఖరి
దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, సైనిక దాడులను నిలిపివేయాలని అమెరికాపై ఇరాన్ ఒత్తిడి తెస్తోంది. జరగబోయే పరిణామాలను అమెరికా నిర్దేశించడం దానికి సుతరామూ ఇష్టం లేదు. వివాదానికి కేంద్ర బిందువైన హార్ముజ్‌పై ఒమన్‌తో ఇరాన్ చర్చలు జరిపింది. జలమార్గం నిర్వహణ కోసం స్వచ్ఛంద వినియోగ రుసు మును వసూలు చేయడంతో పాటు గల్ఫ్ దేశాల మద్దతు ఉన్న ఓ ప్రతిపాదనను ఒమన్‌కు అందజేసింది. ఇరాన్‌ను నేరుగా ఎదుర్కోవడంకంటే వాణిజ్యనౌకలకు రక్షణ క ల్పించడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సముద్ర మార్గాలను కాపాడుకోవడంపై గల్ఫ్ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇందుకోసం సౌదీ నేతృత్వంలో ఓ సముద్ర కూటమి ఏర్పడింది. ఈ పరిణామం ఇరాన్‌కు ఓ రకంగా విజయమేనని చెప్పాలి. అమెరికా సైన్యాన్ని నేరుగా ఎదుర్కోలేకపోయినా ప్రభుత్వాలను, నౌకాదళా లను రక్షణాత్మక స్థితిలోకి నెట్టడం ద్వారా ఇరాన్ వాటికి నష్టాలను కలిగించగలదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -