నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మూడోవారంలోనూ వాడీవేడీగా సాగుతున్నాయి. పది రోజల క్రితం జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనలపై లాఠీచార్జీ ను నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయోధ్య రామందిర్ విరాళాల చోరీపై సమగ్ర చర్చ జరగాలని, పారదర్శక దర్యాప్తు నిర్వహించాలని మోడీ ప్రభుత్వాన్ని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలోనే కేంద్రం పలు బిల్లులను ఆమోదించింది. తాజాగా గత పార్లమెంట్ సమావేశాల్లో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill )ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందుకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును రంగంలోకి దింపింది. దీనిలో భాగంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వం ప్రతిపాదించే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలపాలని కోరినట్లు సమాచారం.
అయితే రిజిజు ప్రతిపాదను రాహుల్ గాంధీ తిరస్కరించనట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఉభయ సభల్లో అయోధ్య రామ్ మందిర్ విరాళాల చోరీపై చర్చ జరగాలని, అలాగే రాజధానిలో జూలై 20న జరిగిన నిరసన సందర్భంగా విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యల గురించి.. హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేసేంత వరకు సభలో ఎటువంటి కార్యకలాపాలు జరగవని ప్రతిపక్ష నాయకుడు కిరణ్ రిజిజుకు చెప్పారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, గత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ చర్యను ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. డీలిమిటేషన్ బిల్లును వేరుగా ప్రవేశపెట్టాలని, సదురు బిల్లుపై రాష్ర్టాలకు పలు సందేహాలున్నాయి తెలియజేశాయి. అయినా కానీ మోడీ ప్రభుత్వం మొండిగా ముందుకుకెళ్లడంతో లోక్ సభలో సదురు బిల్లు వీగిపోయింది.



