మెటాకు పార్లమెంటరీ స్థాయీ సంఘం అల్టీమేటం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సీజేపీ నిరసనల నేపథ్యంలో యువతను ఉద్దేశించి జులై 23న ప్రధాని పెట్టిన వీడియోను తొలగించినందుకు క్షమాపణ చెప్పాలంటూ ఐటీపై పార్లమెంటరీ స్థాయీ సంఘం, మెటా సీఈవో మార్క్ జుగర్బెర్గ్కు మూడు రోజుల గడువును జారీ చేసింది. క్షమాపణ చెప్పని పక్షంలో కంపెనీకి ఉన్న చట్టబద్ధమైన రక్షణను రద్దు చేస్తామని స్థాయీ సంఘం హెచ్చరించింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఒక లేఖను విడుదల చేసింది. ప్రధాని విడుదల చేసిన వీడియోను కంపెనీ బ్లాక్ చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే దీనిపై మెటా వివరణ ఇవ్వాలని సీనియర్ అధికారులు కోరారు. మెటా వ్యవస్థాపకుడు జుగర్బర్గ్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మూడ్రోజుల్లోగా క్షమాపణ చెప్పని పక్షంలో ఐటీ చట్టంలోని 79(3) సెక్షన్ కింద కల్పించబడుతున్న రక్షణను తొలగిస్తామని ఆ లేఖ స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారం, ప్రకటన (సీఎస్ఎఎం)లపై బీబీసీ చేసిన రిపోర్టింగ్ను కూడా కమిటీ ఉటంకించింది. అలాగే మహిళలను కించపరుస్తున్న సమాచారాన్ని ప్రచారం చేసే వేదికలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
గూగుల్ ఇండియాపై చర్య
అలాగే గూగుల్ ఇండియాకు ఇప్పటివరకు గల రక్షణాత్మక చర్యలను ఎత్తివేయాలని కూడా కమిటీ డిమాండ్ చేసింది. దీనివల్ల వ్యక్తులు పెట్టే అభ్యంతరకరమైన పోస్టులను ప్రచురించినందుకు ప్రచురణకర్తగా సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. గూగుల్ ప్లే నుండి డౌన్లోడ్ చేసిన యాప్ల నుండి జరిగిన సైబర్ మోసాల కారణంగా రూ.48లక్షలకు పైగా ఫిర్యాదుదారులు కోల్పోయారంటూ హైదరాబాద్లో వచ్చిన సైబర్ నేరాల ఫిర్యాదులను కూడా ఆ లేఖలో కమిటీ ఉటంకించింది. ఈ ఫిర్యాదుల్లో గూగుల్ ఇండియా భారత్ మేనేజర్ను సహ నిందితుడుగా పేర్కొన్నారు. ఐటీ కార్యదర్శి ఎస్.కృష్ణన్ను ఉద్దేశిస్తూ విడుదల చేసిన ఈ లేఖపై అటు ఐటీ శాఖ గానీ ఇటు మెటా గానీ వెంటనే స్పందించలేదు. గూగుల్ వ్యాఖ్యానించడానికి తిరస్కరించింది.
ప్రధానికి క్షమాపణ చెప్పాలి
- Advertisement -
- Advertisement -



