విద్యార్థులపై దాడికి సమాధానం చెప్పాలి : పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళన
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
‘‘అమిత్ షా ఎక్కడ?, విద్యార్థులపై దాడికి సమాధానం చెప్పాలి’’ అంటూ పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీశాయి. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకులపై పోలీసు దాడి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడాలని, అయోధ్యలోని రామ మందిరం విరాళాల చోరీపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ గురువారం లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగింది. ఈ డిమాండ్లను లేవనెత్తుతూ ప్రతిపక్షాలు పార్లమెంటు వెలుపల నిరసన కొనసాగించాయి. జంతర్ మంతర్ వద్ద యువత నిరసనపై పోలీసుల క్రూరత్వం గురించి వివరించడానికి నిరాకరించిన హోంమంత్రి అమిత్ షాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమిత్ షా నుండి వివరణ కోరుతూ గురువారం ప్రతిపక్షాలు రాజ్యసభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించాయి. దీంతో ప్రతిపక్షాల ఆవేదనను తెలియజేయాలని రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును ఆదేశించక తప్పలేదు. వారాలుగా లోక్సభ, రాజ్యసభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అమిత్ షా నిరాకరించడం కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిని కలిగించింది. సభలో హోం మంత్రి వివరణ ఇచ్చే వరకు నిరసనలు ముగియవని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.
గత నెల 20న సీజేపీ, వామపక్ష విద్యార్థి సంఘాలు నేతృత్వం వహించిన పార్లమెంట్ మార్చ్ను అణచివేసేందుకు హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పోలీసులు, సిఆర్పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెల్లెట్ గన్లు, మేకులు దింపిన లాఠీలు, ఎలక్ట్రిక్ లాఠీలను ఉపయోగించి నిరసనకారులను అణచివేసేందుకు ప్రయత్నించారు. పలువురు విద్యార్థులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే జంతర్ మంతర్ హింసా కాండ జరిగింది. దీని తర్వాత, హోం మంత్రి నుంచి వివరణ కోరుతూ ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల, వెలుపల తీవ్రంగా నిరసనలు తెలుపుతున్నాయి. జూలై 20 నుంచి అమిత్ షా ఉభయ సభలలోనూ హాజరు కాలేదు. ఆయన ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులను హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. దీంతో ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ఐక్యంగా నిరసనలను తీవ్రతరం చేశాయి. ‘అమిత్ షా ఎక్కడ?’, ‘అమిత్ షా సమాధానం చెప్పాలి’ వంటి నినాదాలు చేస్తూ ప్రతిపక్షం ఆందోళన చేపట్టింది.
ప్రత్యేక సమావేశం లేదు
ఇదిలా ఉండగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేసే రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలిచే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించకపోవడంతో లోక్సభలో వీగిపోయింది. ఈ బిల్లును ఆమోదింపజేయడానికి అవసరమైన మెజారిటీని సాధించేందుకు ప్రభుత్వం, కొన్ని ప్రతిపక్ష పార్టీలను విభజించడం, డీఎంకేతో సహా పలు పార్టీలను ఒప్పించడం వంటి పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుందనే వార్తలు వచ్చాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ ఖాయం కాని పరిస్థితుల్లో ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టి విఫలమైనా, అది కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.



