Friday, March 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅధికారిక శ్రమదోపిడీని రద్దు చేయాలి

అధికారిక శ్రమదోపిడీని రద్దు చేయాలి

- Advertisement -

కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి : కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షా ఉద్యోగుల మహాధర్నాలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షా ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని వక్తలు విమర్శించారు. దాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై గురువారం టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షలు చావ రవి అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ కె.నాగేశ్వర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పోరాటాలతో.. ప్రసూతి సెలవులు, 12 నెలల జీతం, నెలకు రెండ్రోజుల సెలవులు సాధించుకున్నట్టు గుర్తుచేశారు.

సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరాటానికి సిద్ధం కావాలనీ, ఉద్యోగులు, కుటుంబాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని సూచించారు. అనాథలు, పాక్షిక అనాథ బాలికల కోసం కేజీబీవీలు, వీధి బాలల పునరావాసానికి యూఆర్‌ఎస్‌లు, విద్యా గణాంకాల సేకరణతో పాటు ప్రాథమిక పాఠశాలల అకడమిక్‌ సహకారంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. వారికి కనీస వేతనాలు అమలు చేయాలనీ, సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ నాయకులు ఎం సంయుక్త మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలనీ, ఉద్యోగి మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు.

భవిష్యత్తులో పోరాటాలను తీవ్రం చేస్తాం : చావరవి
తెలంగాణ తొలి పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.వెయ్యి వార్షిక ఇంక్రిమెంట్‌ను మంజూరు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షలు చావరవి డిమాండ్‌ చేశారు. కేజీబీవీ ఉద్యోగులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వేతనాలు ఇస్తున్నారనీ, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంలో ఈ వ్యత్యాసం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దేశ వ్యాప్తంగా ఒకేరకమైన వేతనాలు అమలు చేయాలని, అందుకు అవసరమైన అదనపు నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

యూటీఎఫ్‌ చేసిన పోరాటాలతో గతంలో కొన్ని డిమాండ్లు సాధించుకున్నారని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సమరశీల పోరాటాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. రెగ్యులర్‌ ఉద్యోగితో సమానంగా పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగికి బేసిక్‌ పే ఇవ్వాలనీ, ఏండ్ల తరబడి కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించిందని గుర్తుచేశారు. గతంలో పదేండ్ల సర్వీస్‌ పూర్తయిన వారిని రెగ్యులర్‌ చేసేలా జీవో 212 తెచ్చారనీ, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. యుడైస్‌ ఎల్లకాలం ఉంటుందనీ, కేజీబీవీల సంఖ్య పెరుగుతోందనీ, అందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకాలం 29 రోజుల వేతనం చెల్లింపుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ ఉద్యోగుల సమస్యలపై టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పలు పోరాటాలు నిర్వహించి సాధించుకున్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముఖ్యమైన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశతో రెండేండ్లు గడువు ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మూడు దశల్లో పోరాటం చేసినట్టు తెలిపారు. విద్యాశాఖ వెంటనే చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 20 ఏండ్లుగా ఉద్యోగులకు నామమాత్రపు వేతనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. వారికి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. శాసనసభలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమాన పనికి సమాన వేతనమివ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా శ్రమదోపిడీ చేసేందుకు ఒకే పని చేసే వారికి ప్రభుత్వం రకరకాల పేర్లు పెట్టి మోసం చేస్తోందన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిథ్యం పెరిగితే ప్రజా సమస్యలు మరింత ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటంతో పాటు రాజకీయ చైతన్యం కూడా పెంచుకోవాలని ఆయన సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ టీఎస్‌యూటీఎఫ్‌ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ ధర్నాలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా భవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, కేజీబీవీ, యుఆర్‌ఎస్‌, సమగ్ర శిక్ష నాయకులు విశాలాక్షి, లక్ష్మి, మంజుల, గోపిలత, యాదగిరి, పాషా, సురేందర్‌, కుమార స్వామి, గంగామణి, మంజులత, సుమన చైతన్య, మంజుల, వెంకటప్ప, రాజు, రవికుమార్‌, సింహాచలం, విశాలి, చిన్నయ్య, వివిధ జిల్లాల టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు, వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -