నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో శనివారం తెల్లవారుజామున దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
యూనివర్సిటీ రెసిడెన్స్ హాళ్ల వెలుపల తెల్లవారుజామున 1:28 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా క్యాంపస్లో లాక్డౌన్ విధించిన అధికారులు, అనంతరం దానిని ఎత్తివేశారు.
గాయపడిన వారిలో ఒకరు యూనివర్సిటీ విద్యార్థి అని చెస్టర్ఫీల్డ్ కౌంటీ పోలీసులు ధ్రువీకరించారు. మిగిలిన వారు వర్సిటీ పరిసర ప్రాంతాలకు చెందిన వారు కావొచ్చని భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది డ్రైవ్-బై షూటింగ్ కాదని, పలువురు దుండగులు ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



