– తన సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మనస్థాపం..
నవతెలంగాణ – ఊరుకొండ
ఓవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతానికి చెందిన కాళిదాసు (38) తన వ్యక్తిగత సమస్యలపై ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో ఆయన మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితుడు కాళిదాసు ఆరోపించినట్లు తెలిపారు.
కాళిదాసు అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కు కాల్ చేసి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న కాళిదాసు తన ఆత్మహత్యకు వ్యక్తిగత సమస్యల కారణమనీ, తన సమస్యను పోలీసులు పట్టించుకోలేదని ఆవేదనతో చెప్పారని పేర్కొన్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



