ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు
మహిళలకు వడ్డీ లేని రుణాలు : రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామసభలో సీఎస్ రామకృష్ణారావు
నవ తెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మహిళా సాధికారత కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తోందని తెలిపారు. 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎస్తోపాటు కలెక్టర్ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.
గ్రామ సభలో ఏర్పాటు చేసిన సంక్షేమ శాఖ, ఉద్యానవన శాఖ, వైద్య ఆరోగ్య శాఖల స్టాల్స్ను సీఎస్, కలెక్టర్ సందర్శించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. ప్రజల సమస్యలను సీఎస్, కలెక్టర్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. 2047-విజన్తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఉద్దేశమని అన్నారు. మనమందరం ఈ ప్రగతి పాలనలో భాగస్వాములం కావాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలతోపాటు కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు.
అన్ని హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు, వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. గ్రామసభ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, జిల్లా అధికారులు శ్రీలత, సురేష్, వనజాత, శ్రీలక్ష్మి, లలితాదేవి, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



