– మొదటి వారం 11 దరఖాస్తులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే దమ్మపేటలో ప్రశాంతంగా ముగిసింది. మొదటి వారం గా సోమవారం 11 దరఖాస్తులు అందాయి అని కార్యక్రమం నోడల్ అధికారి,ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం నిర్వహించారు.
వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.రెవెన్యూ శాఖకు ఏడు, ఎలక్ట్రిసిటీ శాఖ కు రెండు,అటవీ, పంచాయతీ రాజ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు అందాయి. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కార్యక్రమంలో తహసీల్దార్,ఇంచార్జి డిప్యూటి కలెక్టర్ మద్దినేని మురళి,ఎస్హెచ్ఓ ఎస్ఐ బి.రాజేష్ తో పాటు 28 శాఖల సిబ్బంది పాల్గొన్నారు.



