గత డిసెంబర్ లోనే కొలువుదీరిన జీపీ పాలకవర్గాలు
నాలుగు నెలలవుతున్నా కోఆప్షన్ సభ్యులను నియమించని వైనం
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మాత్రం ముందుకు రావడం లేదు. సాధారణంగా నూతన పాలకవర్గం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
మండలంలో 15 పంచాయతీలు..
భూపాలపల్లి జిల్లాలో గతేడాది డిసెంబర్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు అందుబాటులోకి కూడా వచ్చాయి. నాలుగు నెలలవుతున్నా కోఆప్షన్ సభ్యుల నియామకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. మండలంలో ఉన్న జీపీల ప్రకారం మొత్తం 45 మందిని కో ఆప్షన్ సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. గ్రామ అభివృద్ధిలో వీరి సలహాలు పంచాయతీ సభ్యులు తీసుకుంటారు.ప్రస్తతానికి ఈ నియామకాలపై ప్రభుత్వం,ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి మార్గదర్శకాలు అందలేదని తెలుస్తోంది.
ప్రతీ జీపీకి ముగ్గురు..
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి కోఆప్షన్ సభ్యులుగా ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి,మరొకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, మూడో వ్యక్తిగా పంచాయతీకి స్థలం ఇచ్చిన దాత లేదా ప్రవాస భారతీయులను (ఎన్ఆర్ఎ) నియమించాలి. వీరికి వార్డు సభ్యులతో సమానమైన హోదా ఉంటుంది. అయితే సభల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటు హక్కు మాత్రం ఉండదు.
ఆదేశాలు రాగానే నియమిస్తాం: విక్రమ్ కుమార్…ఎంపిఓ
ప్రతీ పంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది.అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చాక ప్రక్రియ పూర్తి చేస్తాం.


