పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫీజు బకాయిలపై రాష్ట్ర హైకోర్టు విద్యార్థుల నుంచి వసూలు చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి వారికి చెల్లించాలన్న తీర్పు సరైనది కాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఇది విద్యార్థుల చదువుల అభివృద్ధికి గొడ్డలిపెట్టనీ, హైకోర్టు తీర్పును పున్ణసమీక్ష చేయాలని కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు కాలేజీలు ప్రభుత్వం ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నాయని తెలిపారు. ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలకు ఫీజు బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవాలన్న తీర్పు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
అణాగారిన వర్గాల నుంచి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్న 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులే ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారని వివరించారు. ఈ తీర్పు వల్ల వారు మరింత వేధింపులకు గురవుతారని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు ఫీజు బకాయిలు రావడం లేదంటూ పేద విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును పున్ణసమీక్ష చేయాలని కోరారు. ఫీజుల విడుదల కోసం ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



