– రోగులున్న అంబులెన్స్లు ఇబ్బంది పడే అవకాశం
– ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని అధికారులను కోరుతున్న ప్రజలు
నవతెలంగాణ – కామారెడ్డి : అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడాల్సిన ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా సైరన్లను వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఓ ప్రైవేట్ అంబులెన్స్ (టీజీ 17 టి 1954) సైరన్ మోగిస్తూ అత్యంత వేగంగా వెళ్లడం కామారెడ్డి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అంబులెన్స్ సైరన్ వినిపించడంతో అత్యవసర పరిస్థితి ఉందని భావించిన వాహనదారులు, బాటసారులు పక్కకు తప్పుకుని దారి ఇచ్చారు. ఆ అంబులెన్స్లో రోగి లేకపోవడం గమనార్హం. రోగి లేకున్నా సైరన్ మోగిస్తూ అత్యవసర వాహనానికి ఉన్న ప్రాధాన్యతను దుర్వినియోగం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంబులెన్స్లలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సైరన్ను వినియోగించాల్సి ఉండగా, అనవసరంగా సైరన్ మోగిస్తూ వేగంగా వెళ్లడం వల్ల ఇతర వాహనదారులు గందరగోళానికి గురై ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సైరన్ వినియోగం, ప్రమాదకర డ్రైవింగ్ వంటి అంశాలపై సంబంధిత మోటారు వాహన చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు అత్యవసర సేవల పవిత్రతను కాపాడాలని, రోగి లేదా అత్యవసర పరిస్థితి లేనప్పుడు సైరన్లను దుర్వినియోగం చేయకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



