నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ చర్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లు, ట్రాఫిక్ బొల్లార్డ్స్, ఇతర భద్రతా ఏర్పాట్లను తొలగించారు. పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల అనుమతి ఇచ్చిన పరిధికి బయట కొన్ని నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వీసా విభాగం సమీపంలోని క్యూలైన్ ఏర్పాట్లు, బారికేడ్లను జేసీబీ సాయంతో తొలగించారు.
ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాక్ ఇలాంటి చర్యలకే పాల్పడింది. ఆ ఘటన జరిగిన మూడు రోజులకే భారత్ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో దీనిని ‘టిట్ ఫర్ టాట్’గా పలువురు భావిస్తున్నారు. అయితే పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిర్మాణాల తొలగింపును ఇస్లామాబాద్లోని పరిణామాలకు ప్రతీకారంగా చేసినట్లు కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఇరుదేశాలు దౌత్య కార్యాలయాల చుట్టూ భద్రతా ఏర్పాట్లను తొలగించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.



