టీ-హబ్లో నిర్వహణ
నియోపోలిస్, గోల్డెన్ మైల్, సరూర్నగర్ ప్లాట్లకు రియల్ దిగ్గజాల పోటీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతాలైన నియోపోలిస్, గోల్డెన్ మైల్, సరూర్నగర్లో నిర్వహించనున్న ప్రీమియం భూముల ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ప్రముఖ డెవలపర్లు, పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ ఈ-వేలానికి సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశాన్ని హైదరాబాద్లోని టీ-హబ్ వేదికగా నిర్వహించారు. ఆరో రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్, ఫెయిర్మౌంట్, సత్వ, వంశీరామ్, ట్రిలైట్, గౌరా వంటి ప్రఖ్యాత డెవలపర్లతోపాటు మరో 20కి పైగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాంతాల్లోని వ్యూహాత్మక ప్రాధాన్యత, అద్భుతమైన కనెక్టివిటీ, అత్యధిక పెట్టుబడి అవకాశాల దృష్ట్యా ఈ భూములకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని బిడ్డర్ల స్పందన స్పష్టం చేస్తోంది.
సందేహాల నివృత్తి.. వేలం ప్రక్రియపై అవగాహన
ఈ సమావేశంలో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్జీసీఎల్ ఎండీ ఉపేందర్ రెడ్డి (ఐఏఎస్), చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ. రవీందర్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ అప్పారావు, ఈఈ ధన్మోహన్ సింగ్, డీఈఈలు రవీందర్, కె. అభిలాష్, తహసీల్దార్ వై.టి. వెంకటేశ్వర్లు, డీటీ డి. శ్రీకాంత్ రెడ్డి, కేపీఎంజీ పార్ట్నర్ అఖిలేష్ అవినాష్, డైరెక్టర్ జీవన్ పండిట్తో పాటు ఎంఎస్టీసీ అధికారులు పాల్గొన్నారు. భూముల వివరాలు, అభివృద్ధి పరిమితులు, వేలం నిబంధనలపై బిడ్డర్లు అడిగిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఎంఎస్టీసీ ప్రతినిధులు ఆన్లైన్ బిడ్డింగ్ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు. ఇందులో సరూర్నగర్ లేఅవుట్ (4,356 చదరపు గజాలు) ఈ-వేలం వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. వచ్చే నెల 5వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
నియోపోలిస్ (4.59 ఎకరాలు), గోల్డెన్ మైల్ (0.70 ఎకరాలు) ఈ-వేలం వచ్చే నెల 9వ తేదీన నిర్వహించనుండగా.. రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 6గా నిర్ణయించారు. కాగా రానున్న ఈ-వేలాల్లో తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఆసక్తి గల బిడ్డర్లు హెచ్ఎండీఏ టోల్ఫ్రీ నంబర్ 7416835522 ను సంప్రదించొచ్చని సూచించారు.
హెచ్ఎండీఏ ప్రీమియం భూముల ప్రీ-బిడ్ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



