నేపాల్లో జల ప్రళయం వేలాది కుటుంబాలకు కన్నీళ్లను మిగిల్చింది. హిమాలయాల ఎత్తుల్లో కదిలిన మంచు, రాళ్లు, మట్టి చివరకు భోటేకోశీ నదిని ఉగ్రప్రవాహంగా మార్చాయి. ఇండ్లు, వంతెనలు, రహదారులు, విద్యుత్ మౌలిక వసతులు కొట్టుకుపోయాయి. తమవారు వస్తారేమోనని ఎదురుచూస్తున్న కుటుంబాలు, ఆచూకీ కోసం సాగుతున్న గాలింపు చర్యలు, శిథిలాలుగా మిగిలిన జీవితాలు ఆ దేశ విషాదాన్ని మరింత హృదయ విదారకంగా మారుస్తున్నాయి. ఈ దృశ్యాలు ప్రపంచాన్నే కంటతడి పెట్టించాయి. తాజా నివేదికల ప్రకారం వేయికి పైగా ప్రాణాలు బలయ్యాయి. గల్లంతైన చాలామంది ఆచూకీ ఇంకా దొరకడం లేదు. ప్రస్తుతం వరదనీరు వెనక్కివెళ్లినా, దానివెంట కొట్టుకుపోయిన బతుకులు, మిగిల్చిన శూన్యం, కుటుంబాల గుండెల్లో నింపిన వేదన మాత్రం ఇంకా అక్కడే ఉంది. ఈ విపత్తు ఎలా సంభవిం చిందని చర్చించుకోవడంకంటే ఏం నేర్పుతున్నదన్నదే ముఖ్యం. ఇది కేవలం వరద కాదు, పర్వతం కదిలితే నది ఎలా మారుతుంది, నది మారితే మనిషి జీవితం ఎంతవేగంగా ఛిన్నాభిన్నమవుతుందో చూపించిన విధ్వంసం. హిమాల యాల్లో మారుతున్నది కేవలం మంచు పరిమాణం కాదు. మంచు, శిలలు, పర్వత వాలులు, నదుల మధ్య ఉన్న సహజ సమతుల్యత కూడా.
ఈ ఘటనలో కూడా హిమనదంలోని భారీ భాగం కూలి, మంచు,రాళ్లు,మట్టి కలిసి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం, ఆ అడ్డంకి తెగిపోవడంతో విధ్వంసక ప్రవాహం ఏర్పడినట్లు తెలుస్తోంది. అంటే విపత్తు నదిలో మొదలుకాలేదు, పర్వతంలో మొదలై నదిని మార్చి, చివరకు మనిషి జీవితాన్ని కూల్చింది. నేపాల్లో పర్వత ప్రాంతాల్లో పర్యాటకం, చిన్న వ్యాపారాలు, వ్యవసాయం, జలవిద్యుత్, సరిహద్దు వాణిజ్యం పరస్పరం అనుసం ధానమై ఉన్నాయి. రహదారులు, వంతెనలు తెగిపోవడమంటే మార్కెట్లు దూరమవడం, విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతినడమంటే ఆదాయం తగ్గడం, పర్యాటక మార్గాలు మూసుకుపోవడమంటే వేల కుటుంబాల ఉపాధి దెబ్బతినడం. అందుకే ప్రకృతి విపత్తు పేదరికాన్ని మరింత లోతుగా చేసే ప్రమాదం కలిగిస్తుంది. అయితే, నేపాల్ ఇప్పటికే రాజకీయంగా పెద్ద మార్పును అనుభవిస్తున్న సమయంలో ఈ విపత్తు వచ్చింది. గతేడాది యువత అసంతృప్తి, పాత రాజకీయ వ్యవస్థపై వ్యతిరేకత, అవినీతి, పాలనా వైఫల్యాలపై జెన్-జీ ఆగ్రహం కొత్త రాజకీయ శక్తికి దారితీశాయి. బలేంద్ర షా నేతృత్వంలోని ప్రభుత్వం ఆ మార్పునకు ప్రతీకగా అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో ప్రకృతి విపత్తు కొత్త ప్రభుత్వానికి కేవలం సహాయక చర్యల పరీక్ష కాదు, ప్రజలు కోరుతున్న కొత్త పాలన ఎంతవరకు ప్రజా భద్రతను ప్రాధాన్యంగా చూస్తుందో తేల్చే పరీక్ష కూడా.
ఈ ఘటనకు నేపథ్యంగా హిమాలయాల మారుతున్న స్వభావాన్ని చూడాలి. ఉష్ణో గ్రతలు పెరుగుతున్న కొద్దీ హిమనదాలు గ్లేషియల్ లేక్ ఔట్బర్స్ట్ ఫ్లడ్ (జిఎల్ఓఎఫ్)కూడా ఇదే ప్రమాద శ్రేణిలో భాగం. హిమనదాలు కరుగు తున్నప్పుడు ఏర్పడే సరస్సులకు సహజంగా మంచు, మట్టి, రాళ్ల అడ్డుకట్టలు ఉంటాయి. అవి బలహీనపడితే భారీ నీటి ప్రవాహం ఒక్కసారిగా దిగువకు దూసుకుపోతుంది. ప్రస్తుత విపత్తుపై కూడా అలాంటి విశ్లేషణలు వెలుబడుతున్నాయి. ఈ సమయంలో పాలకుల ‘అభివృద్ధి నమూనా’ను కూడా పునఃపరిశీలించాలి. పర్వతాలు భరించే సామర్థ్యాన్ని పట్టించు కోకుండా రహదారులు, సొరంగాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాలు పెంచడం ప్రమాదాన్ని పెంచుతుంది. అభివృద్ధి అవసరం. కానీ, ప్రకృతిని లెక్కచేయని అభివృద్ధి చివరకు అభివృద్ధి చేసిన మనిషినే బలి తీసుకునే పరిస్థితి రాకూడదు. అదే నేపాల్ పాలనా వ్యవస్థలోని లోపాల్ని కూడా బహిర్గత పరిచింది. ఇది భారత్కు కూడా హెచ్చరికే. హిమాలయ నదులు రాజకీయ సరిహద్దులను గుర్తించవు.
నేపాల్లో పుట్టే ఆకస్మిక వరదలు దిగువన భారత నదీ పరివాహక ప్రాంతాలను ప్రభావితం చేయగలవు. భారతీయులు కూడా గల్లంతైనవారిలో ఉన్నట్టు వార్తలొస్తు న్నాయి. కుటుంబాలు తమవారి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాయి. అందువల్ల నేపాల్ విషాదం పొరుగు దేశం ఎదుర్కొంటున్న సమస్యగా కాకుండా మన ఉమ్మడి హిమాలయ భద్రతకు సంబంధించిన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. భారత్ సహా అనేక దేశాలు నేపాల్కు మానవతా సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి. అది తక్షణ ప్రాణ రక్షణకు అవసరం. కానీ, సహాయం తర్వాతి దశ పునర్నిర్మాణం మాత్రమే కాకుండా విపత్తు మళ్లీ మహావిపత్తుగా మారకుండా చేసే శాస్త్రీయ వ్యవస్థ నిర్మాణం కావాలి. భారత్, నేపాల్, చైనా, భూటాన్ మధ్య హిమ నదాలు, మంచు సరస్సులు, వర్షపాతం, నదీ ప్రవాహాలు, భూస్కలనాలపై నిరంతర సమాచార మార్పిడి అవసరం. ఉపగ్రహాలు, సెన్సార్లు, డ్రోన్లు, రియల్టైమ్ నదీ గేజ్లను అనుసంధానించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను నిర్మించుకోవాలి. ఈ విపత్తు నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠమిదే.
నేపాల్ విలయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



