నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షత వహించారు. తెలుగు విభాగాధిపతి ఏ. నరేష్ మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు వ్యవహారిక భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మాట్లాడే వ్యవహారిక భాషను పుస్తకాల్లోనూ ఉపయోగించాలనే ఉద్దేశంతో గిడుగు వెంకట రామమూర్తి విశేష కృషి చేశారని వివరించారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, అధ్యాపకులు అనిత, పృథ్వీరాజ్, గజానన్, కునాల్తో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



