తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరి రావు.
నవతెలంగాణ – తుంగతుర్తి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రైతు సంఘం సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో రైతు సంఘం మండల అధ్యక్షులు ఎనగందుల విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంఘం మండల మహాసభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ మేరకు వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయటం కోసం విద్యుత్ సవరణ చట్టం, ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం, యూరియాని రైతులకి అందుబాటులో లేకుండా చేయడం, రైతులకు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటి రైతు వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనివల్ల రైతాంగం దివాళా తీసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకి అర్థం కాని, అందుబాటులో లేని, యాప్ లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు, యూరియా, పంటలు కొనుగోలు, అమ్మకాలు చేయాలనడం నష్టదాయకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే పంథాను అవలంబిస్తున్నదని తెలిపారు. బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేస్తూ రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఆరు సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసాను రెండు సార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు.
రైతులు వేసిన ఓట్లతో గెలిచిన నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తీసుకొచ్చాడన్నారు. రైతుల భూములను లాక్కొని కార్పొరేట్ శక్తుల చేతులో పెట్టారని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.రైతులకోసం కేవలం వామపక్షాలు మాత్రమే పోరాటాలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతు రక్షణ,వ్యవసాయ రంగ పరిరక్షణ,పంటలకు గిట్టుబాటు ధర లాంటి సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వెంటనే కాంటాలను ప్రారంభించి రైతులకు న్యాయం చేకూరేలా చేయాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో సరైన వసతులు కల్పించాలని, నూతన సాంకేతిక విధానం, క్షేత్రస్థాయిలో కూలీల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల ఐరిష్ నమోదు కాకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం స్పందించి సర్వర్ సమస్యలను పరిష్కరించాలని లేదా మాన్యువల్ హాజర్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెలలు గడిచిన కూలీల డబ్బులు పడడం లేదని, వెంటనే ఉపాధి హామీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ మహాసభలను నిర్వహించి రైతుల ఆవేదనను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ సభల ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం మండల నూతన కమిటీని సూర్యాపేట జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్ తో కలిసి ఎంపిక చేశారు.
తెలంగాణ రైతు సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షులుగా ఉప్పుల సోమయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది యాదగిరి, ఉపాధ్యక్షులుగా దొంగరి శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా పరాల అనితను నియమించారు. ఈ కార్యక్రమంలో గడ్డం ఎల్లయ్య, జాజుగళ్ళ ముత్తయ్య, పరాల నాగయ్య, పాలబిందెల మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.



