నవతెలంగాణ – సత్తుపల్లి
జాతీయీకరణ అనంతరం జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 69 సంవత్సరాలు పూర్తిచేసుకుని 70వ యసంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సత్తుపల్లి ఎల్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం బీమా వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహ మాట్లాడుతూ… ఎల్ఐసీ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ, ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని కొనియాడారు. పారదర్శకతకు, విశ్వసనీయతకు, ప్రజా సేవకు ప్రాధాన్యతనిస్తూ దేశ అభివృద్ధిలో ఎల్ఐసీ పోషిస్తున్న పాత్రను కమిషనర్ ప్రశంసించారు.
అనంతరం బ్రాంచ్ మేనేజర్ వైఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ… 1956లో కేవలం రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసీ నేడు సుమారు రూ.60 లక్షల కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అగ్రగామి బీమా సంస్థగా ఎదిగి, కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరాముల సారంగపాణి మాట్లాడుతూ… గత 70 సంవత్సరాలుగా ఎల్ఐసీ సాధించిన ప్రగతి, పాలసీదారుల విశ్వాసం, ఏజెంట్ల అంకితభావం, డెవలప్మెంట్ ఆఫీసర్లు, అధికారులు, సిబ్బంది కృషి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ బానోతు హాథీ, కృష్ణారావు, దొడ్డాకుల గోపాలరావు, వెలవల మోహన్రావు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఆఫీస్ సిబ్బంది, ఏజెంట్లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ నెల 7వ తారీకు వరకు బీమా వారోత్సవాలు జరుగుతాయని అసిస్టెంట్ మేనేజర్ బానోతు హాథీ తెలిపారు.



