Wednesday, September 2, 2026
E-PAPER
Homeఆటలుఆ నలుగురు వచ్చారు

ఆ నలుగురు వచ్చారు

- Advertisement -

జట్టులోకి బుమ్రా, నితీశ్‌, రానా, సుందర్‌
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

నవతెలంగాణ-ముంబయి : ఇటీవల గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు స్వదేశంలో జరుగనున్న అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చారు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా, పేసర్‌ హర్షిత్‌ రానా, ఆల్‌రౌండర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌లు నేరుగా జట్టులోకి వచ్చారు. అయితే, ఈ నలుగురు మెన్‌ బ్లూ తరఫున బరిలోకి దిగేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ లభించాల్సి ఉంటుంది. ఇటీవల జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు సంజు శాంసన్‌, అర్ష్‌ దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌లు సైతం జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో గాయపడి జింబాబ్వే టూర్‌కు దూరమైన స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సైతం జట్టులో చోటు సాధించాడు. రింకు సింగ్‌, ప్రభుసిమ్రన్‌ సింగ్‌, హర్ష్‌ దూబె, సూర్యాన్షు షెడ్జె, అశోక్‌ శర్మ, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌లు జింబాబ్వే పర్యటనకు వెళ్లినా.. తాజాగా అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు చోటు కోల్పోయారు. భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గనిస్తాన్‌ ఆతిథ్యం వహిస్తున్నప్పటికీ.. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు న్యూఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతాయి. భారత్‌, అఫ్గనిస్తాన్‌ టీ20 సిరీస్‌ సెప్టెంబర్‌ 13న ఆరంభం కానుండగా, 15న రెండో టీ20, 17న ఆఖరు మ్యాచ్‌ జరుగుతాయి.

అఫ్గాన్‌తో సిరీస్‌కు 
భారత టీ20 జట్టు
శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, శివం దూబె, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రానా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -