Wednesday, April 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంబేద్కర్‌ ఆశయాలే మా లక్ష్యాలు

అంబేద్కర్‌ ఆశయాలే మా లక్ష్యాలు

- Advertisement -

ఎస్సీ, ఎస్టీలకు పదేండ్లలో దక్కని అవకాశాలు కల్పించాం
దళితున్ని అధ్యక్షా అనాల్సి వస్తుందని కొందరు అసెంబ్లీకే రావడంలేదు
బీజేపీ ప్రతిపాదిత డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం :
అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

”రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మాగాంధీ నిరూపిస్తే… ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించడమేలానో నిరూపించింది బీఆర్‌.అంబేద్కర్‌…ఒకరు దేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తే… మరొకరు రాజ్యాంగాన్ని రూపొందించి అణగారిన వర్గాలకు దిక్సూచిగా నిలిచారు. గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో అంబేద్కర్‌ పాత్ర అంతే ఉంది. ఇద్దరు ఈ దేశానికి రెండు కండ్లు. నేడు ప్రపంచం అంబేద్కర్‌ ఆలోచనలను అనుసరిస్తోంది. ఆయన ఆశయాలే… మా ప్రభుత్వ లక్ష్యాలు” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ 135వ జయంతి సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బడుగు, బలహీన వర్గాలే ముఖ్య పాత్ర పోషించాయన్నారు. పాటతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దర్‌, జయ జయహే తెలంగాణ గీతాన్ని రాసిన అందేశ్రీ పాత్రలను మరిచిపోతారని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమే అవుతుందని నొక్కి చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన పదేండ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు దక్కని ఎన్నో అవకాశాలు రెండేండ్లలో కల్పించామని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రితో పాటు ఐదుగురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించామన్నారు. స్పీకర్‌గా, ఎమ్మెల్సీలుగా, విప్‌లుగా, కార్పొరేషన్‌ చైర్మెన్లుగా పదవులు దక్కాయని వివరించారు. దళిత బిడ్డ స్పీకర్‌గా ఉన్నారని అసెంబ్లీకి రాకుండా కొందరు అవమానిస్తున్నారని విమర్శించారు. ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రులుగా దళితులు ఉండొద్దా అని సీఎం ప్రశ్నించారు. దళితులను అవమానపర్చిన వారే ఒకసారి మైక్‌ ఇవ్వండి అని అడిగేలా ఈ ప్రభుత్వం చేసిందని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ప్రజలకు చేరువైన అభివృద్ధి, సంక్షేమం
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ”ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మొటిక్‌ చార్జీలు 40 శాతం, డైట్‌ చార్జీలు 200 శాతం పెంచిన ఘనత తమ ప్రభుత్వానిది. కులాల అంతరం తొలగిపోవాలని యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నాం. పేదలకు విద్య అందాలన్న అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిస్తున్నాం. నాణ్యమైన విద్య అందించాలన్న ఆశయంతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను తీసుకొస్తున్నాం. పేదలకిచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లల్లో ఎక్కువగా దళితులు, గిరిజనులే ఉన్నారు. 67 వేల ఉద్యోగాలిచ్చాం. అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లభించాయి. మేం నిరంతరం పనిచేస్తుంటే.. వెనక నుంచి కొందరు కుట్రలు చేసి, గోతులు తవ్వుతున్నారు. అలాంటి వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే పని ప్రజలే చేయాలి. పదేండ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ ముందుకెళుతున్నాం. పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారా ఆలోచించండి. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంలో కలిసి రండి” అని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆదేశాలు పాటించినందుకు దక్షిణాది మూల్యం చెల్లిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం
బీజేపీ ప్రతిపాదిత డీలిమిటేషన్‌తో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం సీట్లు పెంపును విరమించుకోవాలని కేంద్రానికి సూచించారు. ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న వారికి డీలిమిటేషన్‌ వల్ల జరిగే నష్టం తెలియక పోవడం శోచనీయమన్నారు. మహిళా రిజర్వేషన్‌ పేరుతో డీలిమిటేషన్‌ బిల్లును సైతం ఆమోదింపజేసే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. మంచి పనికి మా ప్రభుత్వం ముందుంటుందన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన యోధుడు అంబేద్కర్‌ అని అన్నారు. అలాంటి మహనీయున్ని ఇటీవల కొందరు పార్లమెంట్‌లో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి వారందరం ఆయన కల్పించిన హక్కులతోనే ఎదిగామని గుర్తు చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలందరికీ విద్య అందాలనే అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అందించే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, కార్పొరేషన్‌ చైర్మెన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన దళిత, అంబేడ్కర్‌ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -