Wednesday, April 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅణు కార్యక్రమంపైనే విభేదాలు?

అణు కార్యక్రమంపైనే విభేదాలు?

- Advertisement -

– 20 ఏండ్ల విరామం కోరిన అమెరికా..
– ఐదేండ్లకు మాత్రమే సిద్ధమైన ఇరాన్‌
– అందుకే అర్ధంతరంగా ముగిసిన ఇస్లామాబాద్‌ శాంతి చర్చలు!
ఇస్లామాబాద్‌ :
అమెరికా, ఇరాన్‌ మధ్య ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ చర్చలు సఫలమై, మధ్యప్రాచ్యంలో శాంతి ఏర్పడుతుందని అంతా భావించినప్పటికీ.. అలా జరగలేదు. అయితే ఈ శాంతి చర్చల్లో అణు కార్యక్రమం అంశం కీలకంగా మారిందని సమాచారం.
అణు కార్యకలాపాలను ఎంతకాలం నిలిపివేయాలనే అంశంపై రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే చర్చలు ఫలితంగా లేకుండా ముగిశాయని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఈ కథనాల సమాచారం ప్రకారం… పాకిస్తాన్‌ రాజధానిలో అమెరికా-ఇరాన్‌ మధ్య సుమారు 21 గంటల పాటు చర్చలు జరిగాయి. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినప్పటికీ.. విరామ కాలం విషయంలో రెండు పక్షాలూ ఒక అభిప్రాయానికి రాలేకపోయాయని అధికారులు తెలిపారు. రెండు దేశాలూ అణు కార్యక్రమాన్ని నిలిపివేసే విషయంలో వేర్వేరు ప్రతిపాదనలు చేసిన ప్పటికీ.. ఒప్పందం వ్యవధిపై గణనీయమైన తేడాలు ఉన్నాయని సమాచారం.
ఇరాన్‌.. యురేనియం శుద్ధిని గరిష్టంగా ఐదేండ్ల పాటు నిలిపివేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మాత్రం 20 ఏండ్ల పాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతోంది. అయితే ఈ విభేదాలున్నప్పటికీ.. చర్చలు పూర్తిగా విఫలం కాలేదని అధికారులు భావిస్తున్నారు. మరో దఫా చర్చలు జరిగే అవకాశముందని వారు చెప్పారు. అయితే తేదీ ఇంకా నిర్ణయించలేదు.

మేము చాలా దూరంగా ఉన్నాం..
పాకిస్తాన్‌ నుంచి వెళ్లే ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య విభేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ”మేము చాలా దూరంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రమే కాదు, వచ్చే రెండేండ్లలో కూడా కాదు, దీర్ఘకాలం కూడా ఈ విభేదాలు అలాగే ఉంటాయి” అని ఆయన అన్నారు. అమెరికా అధికారులు శాశ్వత నిషేధం కాకుండా 20 ఏండ్ల విరామాన్ని ప్రతిపాదించారు. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అణు ఇంధనం ఉత్పత్తి చేసే హక్కును పూర్తిగా వదిలిపెట్ట లేదని ఇరాన్‌ చెప్పుకునే అవ కాశాన్ని ఇస్తుంది. ఇరాన్‌ మాత్రం తక్కువ కాలం విరా మానికే సిద్ధమని మళ్లీ స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాద నలు ఈ ఏడాది ప్రారంభంలో కూడా విఫలమయ్యాయి. దాంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికా డిమాండ్లను ఇరాన్‌ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమాల ప్రకారం అణు ఇంధనం తయారు చేసే హక్కు తమకు ఉందని అది వాదిస్తోంది. అలాగే, తన అణు సదుపాయాలను కూల్చివేయడం, నిల్వలను విదేశాలకు తరలించడం వంటి డిమాండ్లను కూడా ఇరాన్‌ తిరస్కరిస్తోంది. ఇవే అంశాలు గత చర్చల్లో కూడా ప్రధాన విభేదాలుగా నిలి చాయి. రెండు దేశాల మధ్య విభేదాలు కొన సాగుతున్నప్పటికీ.. విరామ కాలంపై చర్చలు జరగడం కొంత ముందడుగు అని అధికారులు భావిస్తున్నారు. త్వరలో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.

అమెరికాకు అణు అంశం ఎందుకు ముఖ్యం?
అమెరికా ప్రధాన ఆందోళన ఏమిటంటే.. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడం. అందుకు దీర్ఘకాల హామీలు, కఠిన తనిఖీలు అవసరమని అమెరికా భావిస్తున్నది. అలాగే, శుద్ధి చేసిన యురేనియంపై నియంత్రణ, ఒప్పందం అమలు జరుగుతుందో లేదో నిర్ధారించే పద్ధతులను కూడా యూఎస్‌ కోరుతోంది. ఇవి లేకపోతే ఏ ఒప్పందమూ నమ్మదగినదిగా ఉండదని వారు భావిస్తున్నారు.

నౌకాశ్రయాలపై ఆంక్షలు.. ఉద్రిక్తత పెంపు
ఈ చర్చల నేపథ్యంలో అమెరికా సైన్యం ఇరాన్‌ పోర్టులను అడ్డుకోవడం ప్రారంభించింది. దీని ఉద్దేశ్యం ఇరాన్‌ చమురు ఎగుమతులను నిలిపివేయడం ద్వారా ఒత్తిడి పెంచడం. దీనిపై ఇరాన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ పోర్టులపై దాడి జరిగితే.. ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -