బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బందీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. బీఆర్ఎస్ హెచ్చరికతోనే ప్రభుత్వం కండ్లు తెరిచి అక్కడ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వారుతో కేటీఆర్తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ‘బోధించు, సమీకరించు, పోరాడు’అనే అంబేద్కర్ సిద్ధాంతమే పునాదిగా తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. మాటల్లోనే కాకుండా, చేతల్లో గౌరవం చూపించాలనే ఉద్దేశంతో దళితుల కోసం వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశామనీ, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024 నుంచి ఈ విగ్రహాన్ని బందీగా మార్చిందని అన్నారు. తాము 14 రోజుల క్రితం హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోందని వివరించారు. చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్తోపాటు బీసీ, రైతు డిక్లరేషన్లను అమలు చేసే వరకు అంబేద్కర్ స్ఫూర్తితో తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కేటీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు విగ్రహం కింది భాగంలో ఉన్న భవనంలోని మ్యూజియంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత విశేషాలను, చారిత్రక ఘట్టాలను వారు ఆసక్తిగా తిలకించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని బందీ చేసిన కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



