– గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
శివ ప్రసాద్ శుక్లా ఆమోదం..ప్రణాళికా సంఘం నుంచి చిన్నారెడ్డి సైతం తొలగింపు
ఆ స్థానంలో గద్వాల విజయ లక్ష్మికి చోటు..రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్గా నేరెళ్ల శారద కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణి నియామకం..
కాంగ్రెస్ అధిష్టానాన్ని సీఎం బ్లాక్ మెయిల్ చేశారంటూ కొండా సురేఖ ఆరోపణలు
తానెలాంటి తప్పూ చేయలేదంటూ వివరణ..ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ర్ట రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆమెతోపాటు వనపర్తి పరిణామాల నేపథ్యం లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు గురువారం పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇదే విషయమై పలుమార్లు సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు, దానిపై కొండా దంపతుల వ్యవహారశైలి, చిన్నారెడ్డి పార్టీలో అనుసరిస్తున్న తీరు గురించి అధిష్టానానికి ఏకరువు పెట్టారు. గతంలో పలుమార్లు అవకాశమిచ్చినప్పటికీ వారు తమ పద్ధతులను మార్చుకోవటం లేదని విన్నవించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన మంత్రివర్గంలో స్థానం పొందిన సురేఖ వ్యవహారం గతంలో కూడా వివాదాస్పదమై నా, ఈసారి సీఎం రేవంత్రెడ్డి ఆమెపై చర్యకు గట్టిగా పట్టుబట్టారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సైతం చర్యలకే మొగ్గు చూపారు. పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మెన్ మల్లు రవి సైతం అదే సిఫారసు చేయటంతో వారిద్దరిపై వేటుకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో క్యాబినెట్ నుంచి సురేఖను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాకు లేఖ పంపారు. ఆమెను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. రాజీనామాకు కొండా సురేఖ ససేమిరా అనడంతో ఆమెను తొలగించాలని సీఎం సిఫారసు చేశారు. గురువారం రాత్రి లోక్భవన్కు వెళ్లిన సీఎం…గవర్నర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొండా సురేఖ బర్తరఫ్కు దారితీసిన కారణాలను వివరించారు. ఆ వెంటనే ఆమెను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే… ఇటీవల పరకాల నియోజకవర్గం గీసుకొండలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాం శమయ్యాయి. సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ (డీఏసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమె పీసీసీ క్రమశిక్షణా సంఘానికి తన వివరణను అందజేశారు. కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కోరారు. మరోవైపు వనపర్తి వ్యవహారంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. వివరణ ఇవ్వాలంటూ ఆయనకూ డీఏసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలను పీసీసీ హైకమాండ్కు పంపింది. దీంతో వారిద్దరిపై వేటుకు అధిష్ఠానం అనుమతిచ్చింది.
వివరణ కూడా తీసుకోలేదు : కొండా సురేఖ
మంత్రి వర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా తనపై వేటు వేశారని, కనీసం వివరణ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో నాయకులకు, ప్రజలకు నిరంతరం ప్రాధాన్యం ఉండేదని ఆమె తెలిపారు. ప్రజలతో, పార్టీ నేతలతో వైఎస్సార్ ఉన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డికి అసలు కమ్యూనికేషన్ లేదని దుయ్యబట్టారు. ఆయన నాయకులతో సరిగ్గా మమేకం కావడం లేదని విమర్శించారు. ‘నేను ఎలాంటి తప్పూ చేయకున్నా నన్ను పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఉరిశిక్ష వేసే సమయంలో కూడా చివరి కోరిక ఏంటో అడుగుతారు. కానీ మంత్రివర్గం నుంచి నన్ను తీసేసే ముందు నా వివరణ కూడా తీసుకోకపోవడం అత్యంత బాధాకరం’ అని ఆవేదన



