వెల్లువెత్తుతున్న డిమాండ్లు
భోపాల్ : మధ్యప్రదేశ్ హైకోర్టు యొక్క గ్వాలియర్ బెంచ్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే దరఖాస్తును కొంత మంది న్యాయవాదుల బృందం ఫిబ్రవరిలోనే హైకోర్టుకు పంపారు. ఈ అభ్యర్థనను పరిశీలించడానికి హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విగ్రహా ఏర్పాటకు అనుమతించింది. అంతేకాకుండా స్థానిక ప్రజా పనుల శాఖను సంప్రదించి, విగ్రహా తయారీ కోసం ఒక శిల్పికి రూ. రెండు లక్షలు కూడా చెల్లించారు. అయితే మరికొంత మంది న్యాయవాదులు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించారు. నిరసన ప్రదర్శన నిర్వహించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం వద్ద జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. దీంతో వివాదం ప్రారంభమయింది. ఈ అభ్యంతరాలతో కమిటీ తన నిర్ణయాన్ని పున:సమీక్షించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు రిజిస్టార్ యువల్ రఘువంశీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏర్పాటు చేశారు. కాబట్టి, హైకోర్టు ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కొంతమంది న్యాయవాదులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయికి మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షులు జితు పట్వారీ లేఖ కూడా రాసారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ కృషిని గుర్తించడానికి, ఆయన పట్ల మనకు గౌరవాన్ని ప్రతిబింబించడానికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని లేఖలో తెలిపారు. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించేవారు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
వీలైనంత త్వరగా విగ్రహం ఏర్పాటు చేయాలి : ఐలూ డిమాండ్
హైకోర్టు ప్రాంగణంలో వీలైనంత తర్వగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిల భారత న్యాయవాదుల యూనియన్ (ఐలూ) సోమవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. విగ్రహా ఏర్పాటును వ్యతిరేకించడాన్ని తీవ్రంగా ఖండించింది. మనుస్మృతి, మనువాదాన్ని మళ్లీ తీసుకుని రావాలని కోరుకునే వాళ్లే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని విమర్శించింది. భారత రాజ్యాంగం కేవలం దేశ ప్రాథమిక చట్టం మాత్రమే కాదని, అది కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటానికి ఒక ఆయుధం కూడా అని, కాబట్టే అది సంఘపరివార్, కుల తత్వ శక్తులను చికాకుపెడుతోందని పేర్కొంది. సోదర న్యాయవాదుల్లో కూడా ఇలాంటి శక్తులు చొరబడ్డం దురదృష్టకరమని తెలిపింది. ప్రతిపాదిత స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. విగ్రహా ఏర్పాటులో భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని, సందేహాస్పదమైన, నిరాధారమైన అభ్యంతరాలను తోసిపుచ్చాలని కోరింది. వీలైనంత త్వరగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కల్పించాలని హృదయయపూర్వకంగా ఆశిస్తున్నట్లు, విశ్వసిస్తున్నట్లు ఐలూ తన ప్రకటనలో తెలిపింది.
గ్వాలియర్ హైకోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ?
- Advertisement -
- Advertisement -