– 17న గేటు మీటింగ్లు విజయవంతం చేయాలి
– జేఏసీ నాయకుడు విడిదాస్
నవతెలంగాణ – కామారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22, 2026 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ నాయకుడు విడిదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 17న రీజియన్లోని అన్ని డిపోల్లో గేటు మీటింగ్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండు పీఆర్సీలు ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలు కల్పించడం, యూనియన్లకు అనుమతి ఇవ్వడం వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.
కార్మికుల పనిగంటలు పెంచినా, జీతాలు మాత్రం 2017 స్థాయిలోనే కొనసాగుతున్నాయని, 2021, 2025లో రావాల్సిన పీఆర్సీలు ఇంకా అమలు కాలేదని తెలిపారు. దీంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే పీఎఫ్, సీసీఎస్, ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్ వంటి బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్నప్పటికీ, కార్మికులకు రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. కార్మిక చట్టాలను పట్టించుకోకుండా పని గంటలు, కిలోమీటర్లు పెంచుతున్నారని, యూనియన్లు లేకుండా అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మెకు ముందు నిర్వహించే గేటు మీటింగ్ల షెడ్యూల్ను ప్రకటించారు. ఆర్మూర్ డిపోలో ఉదయం 6:30 గంటలకు, నిజామాబాద్లో 9:30 గంటలకు, బోధన్లో మధ్యాహ్నం 12:30 గంటలకు, బాన్స్వాడలో 2:30 గంటలకు, కామారెడ్డి డిపోలో సాయంత్రం 6 గంటలకు మీటింగ్లు జరుగుతాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు స్పెషల్ ఆఫ్, ఆఫ్లో ఉన్నవారు తప్పనిసరిగా హాజరై గేటు మీటింగ్లను విజయవంతం చేయాలని విడిదాస్ పిలుపునిచ్చారు.



