నవతెలంగాణ – కాటారం
కాటారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో యువతకు ఉపయుక్తంగా ఉండే విధంగా క్యారం బోర్డ్లను అందజేసిన కార్యక్రమం ఆదర్శప్రాయంగా నిలిచింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూత్కు క్యారం బోర్డ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొడ్డు స్మరణ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా యువత బయట తిరుగుతూ ఆరోగ్య సమస్యలకు గురికాకుండా, ఇంటి వద్దే ఇండోర్ గేమ్స్ ఆడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడల ద్వారా శారీరక-మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కొట్టే సతీష్ హాజరై, ఇలాంటి కార్యక్రమాలు యువత అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు విక్రమ్ సహా ఎస్సీ కాలనీ యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ స్థాయిలో యువతకు ఉపయోగపడే చర్యలు తీసుకోవడం ద్వారా మంచి మార్పుకు నాంది పలుకుతున్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.



